న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై ప్రభుత్వం యథాతథ స్థితిని కొనసాగించింది. ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్), జాతీయ పొదుపు పత్రం(ఎన్ఎన్సీ) తో పాటు ఇతర పొదుపు పథకాలపై పాత వడ్డీ రేట్లే వర్తించనున్నాయి. ఈ నిర్ణయం 2026 జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే త్రైమాసికానికి వర్తిస్తుంది. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) నాలుగో త్రైమాసికానికి (జనవరి 1 నుంచి మార్చి 31) చిన్న మొత్తాలపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదు’’ అని ఆర్థిక మంత్రిత్వశాఖ తన నోటిఫికేషన్లో వెల్లడించింది.
దీంతో సుకన్య సమృద్ధి యోజన పథకం కింద చేసే డిపాజిట్లకు 8.2% వడ్డీ రేటు లభిస్తుంది. మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లకు 7.1% వడ్డీ రేటు కొనసాగుతుంది. పీపీఎఫ్కూ ఇదే వడ్డీ రేటు (7.1 శాతం) వర్తిస్తుంది. పోస్టాఫీస్ పొదుపు డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా ఎలాంటి మార్పు లేకుండా 4 శాతమే కొనసాగనుంది. కిసాన్ వికాస్ పత్ర పథకానికి వడ్డీ రేటు 7.5% (115 నెలలకు మెచ్యూరిటీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకానికి 7.7%, నెలవారీ ఆదాయ పథకంపై 7.4% వడ్డీ రేటు లభించనుంది. చివరిసారిగా 2023–24 నాలుగో త్రైమాసికంలో ఈ వడ్డీ రేట్లను ఆర్థిక శాఖ సవరించింది.


