గ్లోబల్‌ అనిశ్చితి వల్లే గోల్డ్‌ రష్‌ | Gold prices remain volatile amid global uncertainties says Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ అనిశ్చితి వల్లే గోల్డ్‌ రష్‌

Feb 3 2026 5:14 AM | Updated on Feb 3 2026 8:47 AM

Gold prices remain volatile amid global uncertainties says Nirmala Sitharaman

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: వినియోగాన్ని పెంచుతూ, వృద్ధికి దోహదపడే సాధనంగా పెట్టుబడులను ప్రభుత్వం పరిగణిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ఈ ధోరణినే ప్రతిఫలిస్తోందని పేర్కొన్నారు. నిర్దేశిత ద్రవ్య లోటు లక్ష్యాన్ని చూస్తే వృద్ధి సాధనకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. 2026–27 బడ్జెట్‌పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయాలు తెలిపారు. 

అంతర్జాతీయంగా అనిశ్చితి వల్లే పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయని, అనేక సెంట్రల్‌ బ్యాంకులు కూడా బంగారంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇన్వెస్టర్లకు ఏ కరెన్సీపైనా నమ్మకం లేకపోవడాన్ని, అందుకే పసిడి వైపు మొగ్గుచూపడాన్ని ఇది తెలియజేస్తోందని ఆమె వివరించారు. స్పెక్యులేటివ్‌ డెరివేటివ్‌ ట్రేడింగ్‌ జోలికి వెళ్లకుండా సామాన్యులను నిలువరించేందుకే ఎఫ్‌అండ్‌వోపై సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ)ని పెంచినట్లు వివరించారు.

 మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అధ్యయనం ప్రకారం 90 శాతం మంది పైగా రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో తీవ్ర నష్టాల పాలవుతున్నారని వెల్లడైన నేపథ్యంలో ఎస్‌టీటీ పెంపు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే. ‘స్పెక్యులేషన్‌ అత్యధికంగా ఉంటున్న ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌తో తమ పిల్లలు తీవ్రంగా డబ్బు నష్టపోతున్నారని, ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని కోరుతూ చాలా మంది తల్లిదండ్రుల నుంచి నాకు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఎస్‌టీటీని పెంచడం వల్ల ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ చేయకుండా కొంత నిరోధించేందుకు వీలవుతుంది‘ అని మంత్రి చెప్పారు.  

ఆర్థిక పరిస్థితిని బట్టి ద్రవ్యలోటు లక్ష్యం 
ఒక్కో సంవత్సరంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ద్రవ్య లోటు లక్ష్యాలు ఆధారపడి ఉంటాయని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. గతంలో క్రితం ఆర్థిక సంవత్సరం కన్నా కాస్త తక్కువ ఉండేలా ప్రతి ఏటా ద్రవ్య లోటు  లక్ష్యాలు విధించుకునే విధానం ఉండేదని ఆమె తెలిపారు. ఈసారి వృద్ధికి మరింత ప్రాధాన్యమిస్తున్నందున 4.3 శాతం ద్రవ్య లోటు సౌకర్యవంతమైన స్థాయే అనే ప్రభుత్వం భావిస్తోందని మంత్రి వివరించారు. డిజిన్వెస్ట్‌మెంట్, అసెట్‌ మానిటైజేషన్‌ యథాప్రకారంగానే కొనసాగుతాయన్నారు. పన్నుయేతర ఆదాయాలను బట్టి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల విక్రయ పరిస్థితి ఆధారపడి ఉంటుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement