స్వల్పంగా దిగివచ్చిన బంగారం
రికార్డుస్థాయి వద్ద లాభాల స్వీకరణ
అంతర్జాతీయంగా 20డాలర్లు జంప్
ఈవారంలో రికార్డు ర్యాలీ చేస్తున్న బంగారం ధర శుక్రవారం స్వల్పంగా తగ్గముఖం పట్టింది. మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజ్లో 10గ్రాముల బంగారం ధర రూ.215లు నష్టపోయి రూ.52972 వద్ద ట్రేడ్ అవుతోంది. గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ బలపడటం కూడా బంగారం బలహీనపడేందుకు సహకరించినట్లు వారు అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పరుగులు తీయడంతో పాటు రూపాయి బలహీనతలతో ఇటీవల దేశీయంగా భారీగా పెరిగింది. ఈ క్రమంలో నిన్నటి రోజు రూ.53,429 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. అనంతరం బంగారం ట్రేడర్లు లాభాల స్వీకరణ పూనుకోవడంతో రాత్రి ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసేసరికి రూ.215ల నష్టంతో రూ.52,972 వద్ద స్థిరపడింది.
‘‘ఎంసీఎక్స్లో బంగారం ధర కీలకమైన మద్దతు స్థాయి రూ.52,800 నిలబెట్టుకోగలిగింది. ఇదే స్థాయిపైన కొనసాగితే బంగారం ధర తిరిగి రూ.5300 స్థాయిని అందుకుంటుంది. నేడు రూ.52,800స్థాయిని కోల్పోతే బంగారం ధరల్లో బలహీనత చూడవచ్చు ’’ అని మోతీలాల్ ఓస్వాల్ కమోడిటీ హెడ్ మనోజ్ జైన్ అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయంగా పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. నేడు ఆసియా ట్రేడింగ్లో నిన్నటి ముగింపు(1,942డాలర్ల)తో పోలిస్తే 20డాలర్లు లాభపడి 1,962 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా రెండో త్రైమాసిక జీడీపీ మైనస్ 32శాతం క్షీణించడం, డాలర్ ఇండెక్స్ రెండేళ్ల కనిష్టానికి చేరుకోవడం, ఫెడ్ వడ్డీరేట్ల యథాతథ ప్రకటన తదితర కారణాలు బంగారం బలపడేందుకు కారణమవుతున్నాయి. నిన్నరాత్రి అమెరికాలో 11డాలర్ల నష్టంతో 1,942.30 వద్ద ముగిసింది.