ఇంధన భద్రతకు ‘సౌర’ భరోసా | Geopolitical Tensions Highlight India Strategic Need for Solar Energy Security | Sakshi
Sakshi News home page

ఇంధన భద్రతకు ‘సౌర’ భరోసా

Mar 23 2026 11:39 AM | Updated on Mar 23 2026 12:23 PM

Geopolitical Tensions Highlight India Strategic Need for Solar Energy Security

ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గల్ఫ్ రీజియన్‌లో మారుతున్న పరిణామాలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ ఎంత సున్నితమైందో మరోసారి గుర్తుచేశాయి. శిలాజ ఇంధనాల దిగుమతులపై భారీగా ఆధారపడే భారతదేశం వంటి దేశానికి ఇంధన భద్రత అనేది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, అది ఒక వ్యూహాత్మక ప్రాధాన్యత. ఈ నేపథ్యంలో సౌరశక్తి వినియోగాన్ని గరిష్ట స్థాయికి చేర్చుకోవడమే మన ముందున్న ఏకైక మార్గం.

దశాబ్ద కాలంలో ఇలా..

గడిచిన పదేళ్లలో భారత్ సౌరశక్తి రంగంలో అసాధారణ వృద్ధిని సాధించింది. భారీ సోలార్ పార్కులు, రూఫ్-టాప్ ఇన్‌స్టాలేషన్ల ద్వారా దేశీయ సోలార్ పవర్‌ సామర్థ్యం 130 గిగావాట్లకు చేరుకుంది. అయితే, సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ ఆ విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.

భారీ ప్రాజెక్టులు.. వికేంద్రీకృత వ్యవస్థ

భారీ సోలార్ ప్లాంట్లు (ఎల్‌ఎస్‌ఎస్‌) తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ వాటికి ప్రధాన అడ్డంకి ట్రాన్స్‌మిషన్ (సరఫరా) వ్యవస్థ. మారుమూల ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను నగరాలకు చేరవేయడానికి భారీ వ్యయంతో కూడిన కారిడార్లు అవసరం. దీనివల్ల విద్యుత్ నష్టాలు పెరగడం, మౌలిక సదుపాయాల కల్పనలో ఆలస్యం కారణంగా విద్యుత్ తరలింపు నిలిచిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ‘పీఎం సూర్య ఘర్’ వంటి పథకాలు గృహ వినియోగదారులను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా విద్యుత్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడే వినియోగిస్తున్నారు. దీనివల్ల గ్రిడ్‌పై ఒత్తిడి తగ్గుతుంది.

గ్రిడ్ నిర్వహణలో సాంకేతిక ఇబ్బందులు

సాధారణంగా విద్యుత్ గ్రిడ్లు ఒకే దిశలో (పవర్ ప్లాంట్ నుంచి వినియోగదారుడికి) ప్రవహించేలా రూపొందించబడ్డాయి. కానీ రూఫ్-టాప్ సోలార్ వల్ల విద్యుత్ రెండు వైపులా ప్రవహిస్తుంది. దీనివల్ల గ్రిడ్ అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉంది. సంపన్న వినియోగదారులు సోలార్‌ వైపు మళ్లడంతో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నష్టపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని రాష్ట్రాలు అదనపు ఛార్జీలు విధిస్తూ సోలార్ వినియోగాన్ని పరోక్షంగా నిరుత్సాహపరుస్తున్నాయనే వాదనలున్నాయి.

సవాళ్లు - పరిష్కారాలు

సౌర విద్యుత్ ఉత్పత్తి మధ్యాహ్నం వేళలో గరిష్టంగా ఉంటుంది, కానీ ఆ సమయంలో గృహాల్లో వినియోగం తక్కువగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో డిమాండ్ పెరిగినప్పుడు సౌర ఉత్పత్తి ఉండదు. దీనినే అంతర్జాతీయంగా ‘డక్ కర్వ్’ సమస్య అంటారు. దీనిని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. పగటిపూట మిగిలిన విద్యుత్‌ను భద్రపరిచి రాత్రి వేళల్లో వాడుకోవాలి. విద్యుత్ సమృద్ధిగా ఉన్న సమయంలో రేట్లు తగ్గించి వినియోగదారులను ఆ సమయంలోనే ఎక్కువ విద్యుత్‌ వాడేలా ప్రోత్సహించాలి.

సరికొత్త వ్యూహం.. సోలార్, ఈవీ అనుసంధానం

ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత. ప్రభుత్వం పీఎం-డ్రైవ్‌ పథకం ద్వారా ఛార్జింగ్ స్టేషన్లను విస్తరించాలని చూస్తోంది. సగటున ఒక ఇంటిపై ఉండే 3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ నుంచి వచ్చే మిగులు విద్యుత్ తక్కువగా ఉండొచ్చు. కానీ ఒక అపార్ట్‌మెంట్ లేదా కాలనీలోని ఇళ్లన్నీ కలిపి ఆ మిగులు విద్యుత్‌ను అక్కడే ఉండే పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు మళ్లించవచ్చు.

తూత్తుకుడిలోని వీవోసీ పోర్ట్ ఇప్పటికే ఈ నమూనాను విజయవంతంగా అమలు చేస్తోంది. స్థానిక సౌర విద్యుత్‌ను అక్కడే ఈవీ వినియోగానికి అనుసంధానించడం ద్వారా భారీగా ఖర్చు తగ్గించుకున్నారు. భారతదేశ ఇంధన భవిష్యత్తు సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల అనుసంధానంలోనే ఉంది. డిస్కంలు సోలార్‌ను ఒక ముప్పుగా కాకుండా ఒక అవకాశంగా భావించి స్మార్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. అప్పుడే నిజమైన ఇంధన స్వయంసమృద్ధిని సాధించగలం.

ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement