కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో సరికొత్త విప్లవం సృష్టించిన ఓపెన్ ఏఐ భారతదేశంలో తన రాబడి మార్గాలను విస్తరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని చాట్జీపీటీ ఫ్రీ, నెలకు రూ.399 చెల్లించే ‘గో’ ప్లాన్ వినియోగదారులకు సంభాషణల్లో స్పాన్సర్డ్ ప్రకటనలు (యాడ్స్) చూపించడం ప్రారంభించినట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. అయితే, ప్లస్, ప్రో, బిజినెస్, ఎంటర్ప్రైజ్, ఎడ్యుకేషన్ వంటి పెయిడ్ చందాదారులకు ఎటువంటి యాడ్స్ ఉండవని స్పష్టం చేసింది.
వినియోగదారుల డేటా భద్రత
ప్రకటనల వల్ల వినియోగదారుల అనుభవానికి భంగం కలగకుండా ఓపెన్ ఏఐ కఠినమైన నిబంధనలు విధిస్తున్నట్లు చెప్పింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. వినియోగదారులు అడిగే ప్రశ్నలకు ఏఐ ఇచ్చే సమాధానాలపై ఈ ప్రకటనలు ఎలాంటి ప్రభావం చూపవు. ప్రతి సమాధానం కింద ‘స్పాన్సర్డ్’ అని స్పష్టమైన లేబుల్తో యాడ్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ప్రకటనకర్తలకు వినియోగదారుల చాట్ హిస్టరీ, వ్యక్తిగత వివరాలు లేదా ‘మెమరీస్’ పొందే అవకాశం ఉండదు. కేవలం ఇంప్రెషన్లు, క్లిక్ల వంటి విశ్లేషణల సమాచారం మాత్రమే పొందుపరుస్తారు.
నియంత్రణలు
18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి ప్రకటనలు కనిపించవు. అలాగే ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, రాజకీయం వంటి సున్నితమైన అంశాల చర్చల సమయంలో ప్రకటనలు ప్రదర్శించబడవు. సుమారు 330 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులు ఉన్న ఇండియా ఓపెన్ ఏఐకి అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ 4 నుంచి 'చాట్జీపీటీ యాడ్స్ మేనేజర్' ద్వారా రోజుకు రూ.725 ప్రారంభ బడ్జెట్తో వ్యాపార ప్రకటనలు ఇచ్చుకునే వెసులుబాటును కల్పిస్తోంది. మొదటి దశలో డబ్ల్యూపీపీ, ఓమ్నికామ్ ఏజెన్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకోగా మొదటి వారంలోనే 50కి పైగా ప్రముఖ బ్రాండ్లు ప్రకటనలు ఇవ్వడానికి సిద్ధమయ్యాయని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు!


