వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 నుంచి) కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి రానున్నందున అధికారులు, అందుకు సంసిద్ధం కావాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) కోరింది. అధికారులు కొత్త చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, తగినంత స్పష్టతతో పనిచేస్తారన్న ఆశాభావాన్ని సీబీడీటీ చైర్మన్ రవి అగర్వాల్ వ్యక్తం చేశారు.
ఆదాయపన్ను శాఖ అధికారులకు నూతన సంవత్సరం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. కొత్త చట్టానికి మారేందుకు వీలుగా నిబంధనలు, విధానాలు, పత్రాల రూపకల్పన జరుగుతున్నట్టు, ఇందుకు సంబంధించి శిక్షణ కూడా కొనసాగుతున్నట్టు చెప్పారు. ఆదాయపన్ను శాఖ పరిపాలనను సీబీడీటీయే చూస్తుంటుంది. ఏప్రిల్ 1 నుంచి ఆదాయపన్ను చట్టం 1961 స్థానంలో.. ఆదాయపన్ను చట్టం 2025 అమల్లోకి రానుండడంతో ఇచ్చిన ఈ సందేశానికి ప్రాధాన్యం నెలకొంది.
‘‘మీ ప్రమేయం, ఉత్సాహం కొత్త చట్టానికి సాఫీగా మారడాన్ని నిర్ణయిస్తుంది. ఆదాయపన్ను శాఖ పాత్ర అన్నది పన్నుల వసూళ్లు, అమలు వరకే కాకుండా ప్రక్రియలను సులభతరం చేయడం, విశ్వాసం పెంపొందించడం, సేవల కేంద్రంగా మారుతోంది’’అని అగర్వాల్ తన సందేశంలో పేర్కొన్నారు.


