ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి దేశీయ అమ్మకాల్లో తన హవా కొనసాగిస్తూనే.. ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ ఎక్స్పోర్ట్స్ వార్షిక ప్రాతిపదికన 89 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో 26,781 యూనిట్లుగా ఉండగా తాజాగా 50,716 యూనిట్లకు చేరాయి.
హ్యుందాయ్ ఎగుమతులు 21 శాతం పెరిగినప్పటికీ మొత్తం ఎగుమతుల మార్కెట్లో వాటా 20 శాతం నుంచి 18 శాతానికి పడిపోవడం గమనార్హం. అటు నిస్సాన్, ఫోక్స్వ్యాగన్ ఎగుమతులు కూడా 36 శాతం, 78 శాతం క్షీణించినట్లు సియామ్ గణాంకాల్లో వెల్లడైంది. భారత్ నుంచి మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతుల్లో తమ సంస్థ వాటా 66 శాతంగా ఉన్నట్లు మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో కంపెనీ దాదాపు 3.6 లక్షల ప్యాసింజర్ వాహనాలను ఎగుమతి చేసినట్లు వివరించారు. ఇవి మొత్తం పీవీల ఎగుమతుల్లో 48 శాతమని రాహుల్ చెప్పారు. పరిశ్రమ ఎక్స్పోర్ట్స్ 7 శాతం పెరగ్గా, తమ ఎగుమతులు 32 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. తమ తొలి బీఈవీ అయిన ఈ–విటారా ఎగుమతులు గతేడాది ఆగస్టు నుంచి ప్రారంభం కావడం ఎక్స్పోర్ట్స్కి ఊతమిస్తోందని రాహుల్ తెలిపారు.
ఇప్పటివరకు ప్రధానంగా యూరప్లోని 36 దేశాలకు దాదాపు 16,000 యూనిట్లను ఎగుమతి చేసినట్లు వివరించారు. 2030 నాటికి ఎగుమతుల్లో 30 శాతం వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు హ్యుందాయ్ మోటర్స్ ఇండియా ఎండీ తరుణ్ గర్గ్ చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో కొత్త అవకాశాలు లభించగలవని తెలిపారు.


