అమెజాన్‌ ప్రైమ్‌ సంచలన నిర్ణయం.. ఐపీఎల్‌పై రూ. 21 వేల కోట్ల పెట్టుబడి

Amazon Prime and Sony to Jointly Bid for IPL Broadcast Rights - Sakshi

ఇండియాలో గణనీయంగా కస్టమర్‌ బేస్‌ పెంచుకున్న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) సెగ్మెంట్‌లో పోటీ కంపెనీలపై పూర్తి స్థాయి ఆధిక్యం సాధించేందుకు వీలుగా పావులు కదుపుతోంది. 

డిసెంబరులో వేలం
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పో‍ర్ట్స్‌ ఈవెంట్స్‌లో ఒకటైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ హక్కులు దక్కించుకునే ప్లాన్‌లో ఉంది అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో. సోని పిక్చర్స్‌తో కలిసి బిడ్‌ వేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు డిసెంబరులో ఐపీఎల్‌ ప్రసార హక్కులను వేలం వేయనుంది.
21 వేల కోట్లకు పైగానే
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కి సంబంధించి 2023 నుంచి 2017 వరకు ఐదు సీజన్లకు సంబంధించిన ప్రసార హక్కుల కోసం భారీ బిడ్‌ను ప్రైమ్‌ వీడియోస్‌ దాఖలు చేయనున్నట్టు సమాచారం. మార్కెట్‌ వర్గాలు అంచనా ప్రకారం శాటిలైట్‌, డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్రసార హక్కుల కోసం ప్రైమ్‌ వీడియోస్‌, సోని పిక్చర్స్‌ సంయుక్తంగా 3 నుంచి 4 బిలియన్‌ డాలర్ల (సుమారు 21 వేల నుంచి 28 వేల కోట్లు) వరకు ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నాయి. 
ప్రసారాలకు పోటీ
డిజిటల్‌ స్ట్రీమింగ్‌లో ప్రైమ్‌ వీడియోస్‌కి మంచి కస్టమర్‌ బేస్‌ ఉంది. దేశంలోనే నంబర్‌ వన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా ఉంది. అయితే టీవీ ప్రసారాలకు దగ్గర వీక్‌గా ఉంది. ఇక సోని నెట్‌వర్క్‌ ఇటీవల జీ నెట్‌వర్క్‌ను కూడా సొంతం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల బలమైన టీవీ నెట్‌వర్క్‌ని కలిగి ఉంది. ఇలా రెండు సంస్థలు సంయుక్తంగా బిడ్‌ దాఖలు చేయడం ద్వారా స్టార్‌గ్రూపుకి చెక్‌ పెట్టడానికి రెడీ అవుతున్నాయి.
సోనికి షాక్‌
ఐపీఎల్‌ ప్రసార హక్కులు 2012 నుంచి 2017 సోనీ గ్రూపు చేతిలో ఉండేవి. అయితే ఆ తర్వాత జరిగిన వేలంలో సోనీ గ్రూపు ఐదేళ్ల కాలపరిమితికి రూ. 11,050 కోట్లతో బిడ్‌ దాఖలు చేయగా స్టార్‌, హాట్‌స్టార్‌లు కలిసి రూ. 16,348 కోట్లు దాఖలు చేసింది. దీంతో సోని నుంచి ప్రసార హక్కులు స్టార్‌ గ్రూప్‌కి వెళ్లాయి. ఈసారి స్టార్‌ నుంచి ఎలాగైనా ప్రసార హక్కులు సొంతం చేసుకునేందుకు సోనీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌తో జత కట్టాలని నిర్ణయించింది. అయితే ఈ విషయంపై ఇటు సోనీ, అటు అమెజాన్‌ల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
తగ్గేదేలే
ఇక కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్‌ నుంచి వీలైనంత ఎక్కువ ఆదాయం రాబట్టుకునే దిశగా వ్యూహాలు రూపొందిస్తోంది బీసీసీఐ. వేలం పాటలో ఎక్కువ సంస్థలు పాల్గొనేలా చేసి ప్రసార హక్కుల రేట్లకు మరింత ధర పలికేలా ప్రణాళికలు అమలు చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే ఐదు సీజన్ల ప్రసార హక్కుల ద్వారా ఏకంగా 5 బిలియన్‌ డాలర్ల సంపాదనను బీసీసీఐ ఆశిస్తోంది. 

చదవండి :వచ్చే ఏడాది ఐపీఎల్‌పై బీసీసీఐ బాస్‌ కీలక వ్యాఖ్యలు..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top