
ఆన్లైన్లో కొనుగోలు చేసిన ఏ ఉత్పత్తయినా, విక్రేత దగ్గర్నుంచి మన ఇంటి వరకు చేరడం వెనుక బోలెడంత తతంగం ఉంటుంది. ఆ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, భారత్లోని తమ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను (ఎఫ్సీ) సందర్శించే అవకాశాన్ని కల్పించనుంది.
ఈ ఏడాది నాలుగో త్రైమాసికం (క్యూ4) నుంచి ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరులోని తమ ఎఫ్సీల్లో ఉచిత టూర్లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. నిత్యం లక్షల సంఖ్యలో ఉత్పత్తులను నిల్వ చేయడం, కస్టమర్ల ఆర్డర్ల ప్రాసెసింగ్, రవాణా మొదలైన ప్రక్రియలను ఈ సందర్భంగా ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఈ గైడెడ్ టూర్లు వారానికి మూడు సార్లు చొప్పున, ఒక్కోటి 45–60 నిమిషాల పాటు ఉంటాయి. ఒక్కో టూర్లో 20 మంది పాల్గొనవచ్చు.
టోక్యోలో జరిగిన ’డెలివరింగ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో అమెజాన్ ఈ విషయాలు తెలిపింది. ఈ టూర్లపై ఆసక్తి గల వారు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు త్వరలో వీలు కల్పించనున్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఇండియా–ఆ్రస్టేలియా ఆపరేషన్స్) అభినవ్ సింగ్ చెప్పారు. దేశీయంగా అమెజాన్కు బెంగళూరులో 20 లక్షల ఘనపుటడుగుల స్టోరేజ్ స్పేస్తో అతి పెద్ద ఎఫ్సీ ఉంది.
ఇక ఉత్తరాదిలోనే అతి పెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్, ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంది. ఇది 4,50,000 చ.అ.ల్లో, సుమారు ఎనిమిది ఫుట్బాల్ మైదానాలంత పెద్దగా ఉంటుంది. 2014 నుంచి అంతర్జాతీయంగా అమెరికా, కెనడా, తదితర దేశాల్లోని 35 లొకేషన్లలో ఇరవై లక్షల మంది పైగా సందర్శకులు అమెజాన్ ఎఫ్సీలను సందర్శించారు.