ప్రధానికి 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ నివేదిక

15th finance commission submits report to Prime Minister Narendra Modi - Sakshi

నేడు ఆర్థికమంత్రికి సమర్పణ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీకి సోమవారం 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ తన నివేదికను సమర్పించింది. రానున్న ఐదు సంవత్సరాల్లో (2021–22 నుంచి 2025–26) కేంద్రం–రాష్ట్రాల మధ్య పన్ను విభజనసహా పలు ఫైనాన్షియల్‌ సంబంధాలపై 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ తన సిఫారసులను చేసింది. ‘ఫైనాన్స్‌ కమిషన్‌ ఇన్‌ కోవిడ్‌ టైమ్స్‌’ శీర్షికన రూపొందించిన ఈ నివేదికను మంగళవారం కమిషన్‌ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా సమర్పించనుంది. నవంబర్‌ 9న కమిషన్‌ తన నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సమర్పించిన సంగతి తెలిసిందే.

15వ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎన్‌కే సింగ్, సభ్యులు అజయ్‌ నారాయన్‌ ఝా, అనూప్‌ సింగ్, అశోక్‌ లాహిరి, రమేశ్‌ చంద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగం నిర్దేశిస్తున్న ప్రకారం, చర్యల నివేదికతో పాటు కమిషన్‌ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఉన్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం– కోవిడ్‌–19 నేపథ్యంలో కమిషన్‌ ప్రత్యేకంగా 2020–21కి సంబంధించి ఒక నివేదికను సమర్పించింది. ఐదేళ్ల కాలానికి కమిషన్‌ తన సిఫారసులను 2020 అక్టోబర్‌ 30 నాటికి సమర్పించడం తప్పనిసరి. పలు కీలక ఫైనాన్షియల్‌ అంశాలకు సంబంధించి సిఫారసులను ఇవ్వాలని 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ను కేంద్రం  కోరింది. కిందిస్థాయి వరకు పన్ను పంపిణీ, స్థానిక ప్రభుత్వ నిధులు, విపత్తు నిర్వహణ గ్రాంట్‌తో పాటు విద్యుత్, నగదు బదిలీ అమలు, వ్యర్థాల నిర్వహణ వంటి అనేక రంగాలలో రాష్ట్రాలకు పనితీరు ప్రోత్సాహకాలను పరిశీలించి సిఫారసు చేయాలని కమిషన్‌ను కోరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top