ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందనతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 18,685 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 37 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పదో తరగతి పరీక్షలకు 12,731 మంది రెగ్యులర్, 404 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరు కానుండగా 73 కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆయా సెంటర్లలో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, సీసీటీవీ పర్యవేక్షణ, ప్రశ్నపత్రాల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. పరీక్షల విధుల్లో పాల్గొనే అధికారులు ఐడీ కార్డులు ధరించి బాధ్యతాయుతంగా పని చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లు, మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో డీఈఓ నాగలక్ష్మి, డీఐఈఓ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, డీపీఓ సుధీర్, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సులోచనారాణి, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 37 కేంద్రాలు ఏర్పాటు
కొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడిఝెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానుండగా జిల్లాలో 37 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. విద్యుత్, ఆర్టీసీ, పోలీసులు, పంచాయతీ, మున్సిపాలిటీ తదితర శాఖలతో సమన్వయం చేస్తూ పరీక్షల నిర్వహణకు ఇంటర్ విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనుండగా ప్రథమ సంవత్సర విద్యార్థులు 9,278 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 9407 మంది రాయనున్నారు. పరీక్షల సమయానికి అనుకూలంగా బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. ప్రతీ కేంద్రం వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. పటిష్ట పోలీస్ బందోబస్తుతో పాటు పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయిస్తారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్


