భారీగా వ్యవసాయ కనెక్షన్లు
సూపర్బజార్(కొత్తగూడెం): వ్యవసాయానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా గరిష్ట స్థాయిలో కనెక్షన్లు మంజూరు చేశామని విద్యుత్ ఎస్ఈ గొట్టిముక్కుల మహేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 1,038 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఇంకా కొత్త కనెక్షన్ల మంజూరు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఇందుకు అవసరమైన స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల వంటివి సమృద్ధిగా అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
చర్ల: జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఎస్ఈ మహేందర్ తెలిపారు. చర్లలో రూ. 2.40 కోట్లతో ఏర్పాటుచేసిన 5 ఎంవీఏ అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో చర్ల సబ్స్టేషన్లో 5 ఎంవీఏ సామర్థ్యం గల ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్ మాత్రమే ఉండేదని, అది ప్రస్తుతానికి సరిపోతున్నప్పటికీ వేసవిలో విద్యుత్ వాడకం పెరిగినా ఇబ్బంది కలగకుండా కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశామని వివరించారు. దీంతో మరో పదేళ్ల పాటు లోవోల్టేజీ సమస్య రాదని వెల్లడించారు. గిరిజన గ్రామాల్లో ప్రతీ ఇంటికి విద్యుత్ సరఫరా చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. మండలంలోని పెద మిడిసిలేరులో మరో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలన జరుగుతోందని చెప్పారు. కార్యక్రమంలో డీఈలు కె.జీవన్కుమార్, బి.వెంకటేశ్వర్లు, ఏడీఈలు పి.ప్రభాకర్రావు, రాంబాబు, మానస తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఎస్ఈ మహేందర్ వెల్లడి


