పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం పబ్లిక్ పరీక్షల నిర్వహణకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లు, జాయింట్ కస్టోడియన్లు, సీ సెంటర్ కస్టోడియన్లు, మండల విద్యాశాఖాధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 73 పరీక్షా కేంద్రాల్లో 12,731 మంది రెగ్యులర్, 404 మంది ప్రైవేట్ అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. ప్రశ్నపత్రాల భద్రత, రవాణా, సమయపాలన వంటి అంశాల్లో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 బి అమలు చేయాలని అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, పరిశీలక బృందాలను నియమించాలని ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే అనుకూల పరిస్థితులు కల్పించాలని తెలిపారు. కేంద్రాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. డీఈఓ నాగలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ శంభు ప్రసాద్, పరీక్షల సహాయ కమిషనర్ మాధవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్


