ఉత్పత్తి లక్ష్యాలపై సీఎండీ నజర్
రుద్రంపూర్: వార్షిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ లక్ష్యాలపై సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్ దృష్టి సారించారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టాక ఆయన ఇటీవల డైరెక్టర్లు, జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. దాదాపు 5 గంటలపాటు సమీక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నిర్దేశించిన వార్షిక లక్ష్యం 72 మిలియన్ టన్నులు సాధించాలని, రానున్న 35 రోజుల్లో ఉత్పత్తికి ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. గతేడాది ఈ సమయానికి 58.61 మిలియన్ టన్నులు సాధించిన ఏరియాలు ఈసారి సుమారు 7 మిలియన్ టన్నులు ఎందుకు వెనకబడ్డాయో తెలపాలని ఆదేశించారు.
కార్మిక భద్రతకు ప్రాధాన్యమివ్వాలి
మణుగూరు టౌన్: కార్మికుల భద్రకు ప్రాధానమిస్తూ రోజుకు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.15లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ లక్ష్యాన్ని సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్(పిఅండ్పి) కొప్పుల వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం ఆయన ఓసీ–2, ఓసీ–4 గనులను సందర్శించి వ్యూ పాయింట్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధన, వ్యయ నియంత్రణ, కార్మికుల భద్రతపై చర్చించారు. పీకే ఓిసీ కొత్త బెల్ట్ వర్క్ను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తొలుత పీవీ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. జీఎం దుర్గం రామచందర్, అధికారులు శ్రీనివాసచారి, ఆర్.శ్రీనివాస్, ఎం.రమేష్, సిహెచ్ రాంబాబు, వేణుమాధవ్ పాల్గొన్నారు.


