మామిడి రైతులకు రాయితీ
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో మామిడి తోటల్లో కాయల రక్షణకు ఫ్రూట్ కవర్ల వినియోగాన్ని ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తోంది. ఈ విధానం వల్ల పండ్ల నాణ్యత పెరిగి రైతులకు ఆదాయం మెరుగుపడుతుందని ఉద్యాన శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఫ్రూట్ కవర్లు కాగితం, వస్త్రం, బయోడిగ్రేబుల్ పదార్థాలతో తయారు చేస్తారు. కవర్లు తొడిగితే మామిడి కాయలను ఈగలు, కీటకాల, దుమ్ము, ఎండదెబ్బ, వర్షం, రసాయనిక అవశేషాల నుంచి రక్షించుకోవచ్చు. మామిడి కాయలు మార్బుల్ పరిమాణంలో ఉన్నపుడు ప్రూట్ కవర్లు తొడగాలని, కోత వరకు అలాగే ఉంచితే ఉత్తమ ఫలితాలు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఎకరా విస్తీర్ణంలో మామిడి తోటకు కవర్ల ఖర్చు రూ.20 వేలు అవుతుందని, ఇందులో కవర్లు, కూలీలకు కలిపి రూ. 10 వేలు రాయితీ వస్తుందని తెలిపారు.
మామిడి రైతులు రాయితీ పొందడానికి దరఖాస్తు చేసుకోవాలి. పాస్ పుస్తకం, ఆధార్ జిరాక్స్, బ్యాంకు అకౌంట్ జిరాక్స్, ఫ్రూట్ కవర్లు కొనుగోలు చేసిన బిల్లు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో దరఖాస్తుకు జతచేయాలి. పెట్టుబడిలో 50 శాతం రాయితీ లభిస్తుంది.
– జంగా కిషోర్, జిల్లా ఉద్యాన,
పట్టు పరిశ్రమ శాఖాధికారి
ఫ్రూట్ కవర్ల వినియోగంలో 50 శాతం..


