ఖమ్మం అంటేనే కళల గుమ్మం..
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం అంటేనే కళల గుమ్మమని తెలంగాణ లోకాయుక్త జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి అభివర్ణించారు. ఆదివారం ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో నెల నెలా వెన్నెల 103 సాంస్కృతిక కదంబ కార్యక్రమం నిర్వహించగా.. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ రాజశేఖర్రెడ్డికి నిర్వాహకులు మంగళవాయిద్యాలతో ఆహ్వానం పలికాక ఆయన ప్రసంగించారు. జిల్లాతో తనకు విడదీయరాని బంధం ఉందని తెలిపారు. నెల నెలా వెన్నెల కార్యక్రమం 103 నెలల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నాటిక ప్రదర్శనలు నిర్వహించటం గొప్ప విషయమని, అంతరించిపోతున్న నాటక రంగానికి నిర్వాహకులు జీవం పోస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో చావా వెంకయ్య, కాటంనేని రమేశ్, కొల్లి సత్యనారాయణ, ముదిరెడ్డి నిరంజన్రెడ్డి, అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్రావు, డాక్టర్ నాగబత్తిని రవి, నామా లక్ష్మీనారాయణ, వేముల సదానందం, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, నిర్వాహకులు జస్టిస్ రాజశేఖర్రెడ్డిని సత్కరించారు.
ఆలోచింపజేసిన ‘యాగం’ నాటిక
హైదరాబాద్ కళాంజలి కళాకారులు ప్రదర్శించిన ‘యాగం’ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. అధికారం కోసం ఎన్నికల్లో వాగ్దానాలు చేయటం, గెలిచిన తరువాత వాటిని అమలు చేయకపోవటం, అధికారం కోసం యజ్ఞ, యాగాలు చేయటం, జ్యోతిష్కులు చెప్పే మాటలు విని చివరికి భార్యను కూడా దానం చేయటం వంటి అంశాలతో రూపుదిద్దుకొన్న నాటిక ఆలోచింపజేసింది. నాటికను శ్రీశైలమూర్తి రచించగా, కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. చిరంజీవి, అబ్బోజు భావనప్రియ భరతనాట్యం అలరించింది.
జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి
ఖమ్మం అంటేనే కళల గుమ్మం..


