జాతి నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ ప్రస్థానం కీలకం
ఖమ్మంమయూరిసెంటర్: భారతీయ జీవన విధానంలో దేశభక్తి, క్రమశిక్షణను నరనరానికీ ఎక్కించి, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ప్రస్థానం అద్వితీయమని తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని కోణార్క్ హోటల్లో ఆర్ఎస్ఎస్ ప్రతిష్ట వ్యక్తుల సమావేశం నిర్వహించి, ఆర్ఎస్ఎస్ లక్ష్యాలు, ప్రస్తుత శతజయంతి ఉత్సవాలపై సమీక్షించారు. 1925లో డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్ చేత నాగపూర్లో ప్రారంభమైన ఈ సంస్థ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా అవతరించిందన్నారు. సంఘంలో చేరడానికి ఎలాంటి రుసుములు, అప్లికేషన్లు అవసరం లేదని, ప్రతిరోజూ జరిగే శాఖకు హాజరై భగవధ్వజం ముందు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ స్వయం సేవకులేనని సంఘ్ స్పష్టం చేస్తోందన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా రామజన్మభూమి నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు వంటి చరిత్రాత్మక ఘట్టాల్లో ఆర్ఎస్ఎస్ స్ఫూర్తి ఎంతగానో ఉందన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సామాజిక మార్పు కోసం పకృతిని కాపాడుకోవడం, భారతీయ సంస్కృతి, విలువలు కాపాడుకోవడం, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించడం, కుల వివక్ష లేని సమాజాన్ని నిర్మించడం, స్వదేశీ వస్తువులనే వాడటం, మాతృభాషను గౌరవించి అభివృద్ధి చేయడం వంటివి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాటేపల్లి లక్ష్మీనారాయణ, లక్కినేని ప్రసాద్, డాక్టర్ కిషోర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


