నాటకమే జీవితానికి దిక్సూచి
భద్రాచలంటౌన్: నాటక రంగం మనిషి జీవితానికి దిక్సూచి వంటిదని, తన ఎదుగుదలలో నాటకమే కీలక పాత్ర పోషించిందని ప్రముఖ సినీ దర్శకుడు విజయ్ కనకమేడల అన్నారు. శనివారం భద్రాచలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర నాటకోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనిషిలోని నటన, భావోద్వేగాలను వెలికితీయడంలో నాటకానికి మించిన వేదిక లేదన్నారు. తాను సాదాసీదా నేపథ్యం నుంచి వచ్చి, నాటక రంగంలో నేర్చుకున్న క్రమశిక్షణతోనే ఈ స్థాయికి చేరుకున్నానని గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు చదువుతో పాటు కళలపై మక్కువ పెంచుకోవాలని, అది వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని సూచించారు. అనంతరం నిర్వాహకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు.
ఆలోచింపజేసిన ‘విడాకులు కావాలి!’
నాటకోత్సవాల్లో భాగంగా తాడేపల్లికి చెందిన అరవింద ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన ‘విడాకులు కావాలి!’నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వల్లూరు శివప్రసాద్ రచన, గంగోత్రి సాయి దర్శకత్వంలో సాగిన ఈ ప్రదర్శన నేటి తరం దంపతుల మధ్య తలెత్తుతున్న చిన్న చిన్న అపోహలు, పంతాల వల్ల విడాకుల వరకు వెళ్లడం ఎంతవరకు సమంజసమనే అంశాన్ని కళ్లకు కట్టింది. అహంకారానికి పోకుండా సర్దుబాటు ధోరణితో మెలిగితేనే దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుందని స్పష్టమైన సందేశాన్ని అందించింది.
సినీ దర్శకుడు విజయ్ కనకమేడల


