డిజిటల్ క్రాప్ బుకింగ్కు రెడీ..
ఏర్పాట్లు చేస్తున్నాం
● గ్రామానికి ఓ వలంటీర్ను నియమించిన వ్యవసాయశాఖ ● రెండు రోజుల్లో సర్వే ప్రారంభానికి అధికారుల కసరత్తు ● సర్వే నంబర్, రైతు ఫొటో, పంట వివరాలు ఆన్లైన్లో నమోదు
బూర్గంపాడు: పంటల సాగు వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా సేకరించి, పారదర్శకంగా డిజిటలైజేషన్ చేసేందుకు వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం వ్యవసాయశాఖ గ్రామానికి ఓ వలంటీర్ను కేటాయిస్తోంది. వలంటీర్ల నియామకపు ప్రక్రియ కూడా పూర్తి కావొచ్చింది. రెండేళ్ల నుంచి డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేకు వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పనిభారం ఎక్కువగా ఉందంటూ క్షేత్రస్థాయిలో ఏఈఓలు విముఖత చూపడంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో వ్యవసాయశాఖ డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేకు వలంటీర్లను నియమిస్తోంది.
ఇప్పటికే 285 గ్రామాలకు వలంటీర్ల నియామకం
జిల్లాలో మొత్తం 67 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఏఈఓల ఆధ్వర్యంలో కొత్తగా నియమించే వలంటీర్లు డిిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేపట్టనున్నారు. జిల్లాలోని 291 రెవెన్యూ గ్రామాలు ఉండగా, ఇప్పటికే 285 గ్రామాలకు వలంటీర్లను నియమించారు. ఆయా గ్రామాల్లో చదువుకున్న స్థానిక యువకులనే వలంటీర్లుగా తీసుకున్నారు. స్మార్ట్ఫోన్ ఉండి ఆన్లైన్ చేయటంపై అవగాహన కలిగిన వారికి అవకాశం కల్పించారు. డిజిటల్ క్రాప్ బుకింగ్పై రెండురోజులపాటు శిక్షణనిచ్చి క్షేత్రస్థాయి సర్వేకు పంపించనున్నారు. ఆ తర్వాత రెవెన్యూ గ్రామాల భూ భారతి మ్యాప్లతో వలంటీర్లు డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేపట్టనున్నారు. భూ భారతి మ్యాప్లు లేని (ఆర్ఓఎఫ్ఆర్)ప్రాంతాల్లో ఏఈఓలు వ్యవసాయశాఖ పోర్టల్లో సర్వే చేస్తారు. యాసంగిలో పంటలు సాగు చేసిన భూములతో పాటు, పంటలు వేయని భూములను కూడా ఈ సర్వేలో నమోదు చేయాల్సి ఉంటుంది.
సర్వే నంబర్కు రూ.7 చెల్లింపు
వలంటీర్లు క్షేత్రస్థాయికి వెళ్లి ఒక్కో సర్వే నంబర్లో వేసిన పంటను ఫొటో తీసి డిజిటల్గా బుకింగ్ చేస్తే వారికి సర్వే నంబర్కు రూ.7 చొప్పున చెల్లించనున్నారు. ఈ సర్వేలో రైతుల ఫొటో, భూమి విస్తీర్ణం, సాగు చేసిన పంట, రైతుల ఫోన్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను రెండు రోజుల్లో ప్రారంభించేందుకు జిల్లా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటోంది.
డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వే చేస్తున్న ఏఈఓ
డిజిటల్ క్రాప్ బుకింగ్ సర్వేకు ఏర్పాట్లు చేస్తున్నాం. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తాం. సర్వే చేసేందుకు ఏఈఓలు గ్రామాల్లో వలంటీర్లను నియమించారు. వారికి ఒక్కో సర్వేనంబర్లో క్రాప్ బుకింగ్ చేసి డిజిటలైజేషన్ చేసినందుకు రూ 7లు చెల్లిస్తాం. రైతులు ఏ భూమిలో ఏఏ పంటలు వేశారో ఫొటోలతో సహా ఆన్లైన్లో నిక్షిప్తమవుతాయి. దీంతో ఎరువుల సరఫరా, రైతు భరోసా, రైతు బీమా క్లెయిమ్స్, పంట నష్టపరిహారాలు, రుణాలు అందించటం వంటి ప్రక్రియలు చాలా సులభతరమవుతాయి. 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం.
–బాబూరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి


