ముగిసిన సీసీఐ పత్తి కొనుగోళ్లు
● ఉమ్మడి జిల్లాలో 14కేంద్రాల ఏర్పాటు ● రూ.590 కోట్ల విలువైన 7.55లక్షల క్వింటాళ్ల పత్తి సేకరణ
ఖమ్మంవ్యవసాయం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లు శుక్రవారం ముగిశాయి. ప్రైవేట్ మార్కెట్లో కనీస మద్దతు ధర లేనందున రైతులు నష్టపోకుండా సీసీఐ ద్వారా కేంద్రప్రభుత్వం పత్తి కొనుగోళ్లు చేపట్టింది. ఈమేరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 4.77 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా, కొనుగోళ్లకు 14 జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఖమ్మం జిల్లాలో ఎనిమిది, భద్రాద్రి జిల్లాలోని ఆరు కేంద్రాల్లో అమ్ముకునేలా స్లాట్ బుకింగ్కు కపాస్ కిసాన్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. 8 – 12 శాతం తేమ ఉన్న పత్తిని క్వింటాకు రూ.8,110 నుంచి రూ.7,786 చొప్పున కొనుగోలు చేశారు.
33వేల మంది రైతుల నుంచి..
ఉమ్మడి జిల్లాలో సీసీఐ ద్వారా గడువు ముగిసే నాటికి రూ.590 కోట్ల విలువైన 7.55 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. ఖమ్మం జిల్లాలో రూ.360 కోట్ల విలువైన 4.53 లక్షల క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలో రూ.230 కోట్ల విలువైన రూ.3లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రెండు జిల్లాల్లో కలిపి 33వేల మంది రైతుల నుంచి పత్తి సేకరించగా, చివరి దశలో అమ్మిన వారికి తప్ప మిగతా వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. అయితే, ఇంకా పలువురు రైతుల వద్ద పత్తి నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. కూలీల కొరతతో సేకరణ ఆలస్యమైనందున మరికొన్ని రోజులు సీసీఐ కేంద్రాలు కొనసాగించాలని కోరినా ఫలితం దక్కలేదు.


