సారపాకలో విషాదం..
● రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి ● ప్రయోజకుడు అవుతాడనుకుంటే మృతదేహమై ఇంటికి..
బూర్గంపాడు: ఎన్నో ఆశలు, ఆశయాలతో తన కొడుకుని ఇంజనీర్ చేసి గొప్ప ప్రయోజకుడిని చేద్దామని అనుకున్న ఆ తల్లిదండ్రుల కలలు మధ్యలోనే ఆవిరయ్యాయి. స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్తున్న వారి కుమారుడు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతిచెందాడు. కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే అనంతలోకాలకు చేరుకోవడంతో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. సారపాకకు చెందిన పేకేటి నాగ వెంకటరెడ్డి(20) గుంటూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. గురువారం సాయంత్రం స్నేహితునితో కలిసి గుంటూరు నుంచి విజయవాడకు వెళ్తున్న క్రమంలో బొలేరో వాహనం వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నాగ వెంకటరెడ్డి, అతడి స్నేహితుడు రోడ్డుపై పడిపోగా.. అదే సమయాన అటుగా వస్తున్న కంటైనర్ లారీ నాగ వెంకటరెడ్డి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో అతని స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. నాగ వెంకటరెడ్డి మృతదేహాన్ని శుక్రవారం సారపాకకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న పుల్లారెడ్డి, సరితల పెద్ద కుమారుడైన నాగ వెంకటరెడ్డి చిన్నతనం నుంచి చదువులో రాణిస్తున్నాడు. ఎంసెట్లో 10వేల ర్యాంకు రావడంతో గుంటూరు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సాధించాడు. కుటుంబానికి అండగా ఉంటాడనుకునే సమయంలో అతడిని రోడ్డు ప్రమాదంలో కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది.


