చట్టాలపై అవగాహన కల్పించాలి
ఎస్పీ రోహిత్ రాజ్
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు పోక్సో, అత్యాచార చట్టాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ రోహిత్రాజ్ అన్నారు. తన కార్యాలయంలో వివిధ శాఖల ఆధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోక్సో కేసుల దర్యాప్తు, విచారణలో శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలన్నారు. ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో ఇంటి నుంచి వెళ్లిపోతున్న ఘటనలు పెరుగుతున్నందున నేపథ్యంలో భవిష్యత్ జీవితంపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించా ల్సిన అవసరం ఉందని అన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.రాజేందర్, డీఎస్పీలు మల్లయ్యస్వామి, ఆదినారాయణ, ఆర్ఎంఓ చైతన్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రసాద్, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, డీఈఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ జాగిలాలు..
మొయినాబాద్ ఐఐటీఏలో ఎనిమిది నెలల పాటు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించిన పోలీస్ జాగిలాలు షైనీ, లైకాను గురువారం ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు. పేలుడు పదార్థాలను కనుగొనడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన రెండు జాగిలాలు జిల్లా పోలీస్ శాఖలో సేవలందించేందుకు రావడం సంతోషకరమన్నారు. పోలీస్ జాగిలాలకు హ్యాండ్లర్లుగా వ్యవహరిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ లాల్సింగ్, కె.ముత్తయ్య, ఇతర డాగ్ స్క్వాడ్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ లాల్బాబు, ఎంటీఓ సుధాకర్ పాల్గొన్నారు.


