చెరువులో పడి వ్యక్తి మృతి
ములకలపల్లి, (అన్నపురెడ్డిపల్లి): పిట్టలను వేటాడేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదశాత్తూ చెరువులో మునిగి మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. అబ్బుగూడెం గ్రామానికి చెందిన గిరికె కృష్ణయ్య (52) మంగళవారం సాయంత్రం సమీపంలోని చెరువు వద్దకు పిట్టలను పట్టేందుకు వెళ్లి తిరిగి రాలేదు. చెరువు కట్టపై కృష్ణయ్య చెప్పులు కనిపించడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం కానరాలేదు. బుధవారం కృష్ణయ్య మృతదేహం చెరువులో తేలడంతో పోలీసులకు సమాచారం అందించారు. పిట్టల కోసం చెరువులో దిగి, ప్రమాదవశాత్తూ నీటిలో మునిపోయి ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయసింహారెడ్డి తెలిపారు.
విద్యుదాఘాతంతో గేదె మృతి
పినపాక: విద్యుదాఘాతంతో గేదె మృతి చెందిన ఘటన మండలంలోని ఏడూళ్ల బయ్యారం పంచాయతీ కొత్తరెడ్డిపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు తుమ్మ సంజీవరెడ్డికి చెందిన గేదె మేతకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎర్త్ వైర్ తగలి, షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. గేదె విలువ సుమారు రూ.1.20లక్షలు ఉంటుందని రైతు వాపోయాడు.
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
భద్రాచలంటౌన్: ఛత్తీస్గఢ్ నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న పశువులను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ నాగరాజు కథనం ప్రకారం.. పట్టణంలోని చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఒక కంటైనర్లో 75 పశువులను తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పశువులను పాల్వంచలోని గోశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఎన్నికల్లో పెట్టిన ఖర్చు ఇవ్వాలని ఘర్షణ
పాల్వంచ: కార్పొరేషన్ ఎన్నికల్లో నిలబడి ఓడిపోవడం వల్ల భారీగా నష్టం వచ్చిందని, ఆ నగదు ఇవ్వాలని ఘర్షణకు దిగడంతో పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. 37 డివిజన్ సీతారాంపట్నంలో స్వతంత్య్ర అభ్యర్థి ఉబ్బన ధనలక్ష్మి ఓడిపోవడానికి కారణం అయ్యాడని ఆమె తరఫున కొందరు 17వ తేదీన బొల్లేరుగూడెంనకు చెందిన బూరుగుపల్లి ప్రసాద్రావు ఇంటివద్దకు వెళ్లి ఘర్షణకు దిగారు. ఎన్నికల్లో నిలబెట్టి, రూ.30 లక్షల వరకు ఖర్చు చేయించి, చివరికి ధనలక్ష్మికి కాకుండా మరో అభ్యర్థికి మద్దతు ప్రకటించావని, తాము ఓడిపోవడంతో భారీగా నష్టపోయామని, ఖర్చు అయిన డబ్బులు ఇవ్వాలని గొడివ పడి బెదిరించారు. ప్రసాద్రావు ఫిర్యాదు మేరకు వాడపల్లి మహేశ్, నవీన్, కొప్పుల వెంకన్న, కాల్వ రామారావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.
గుర్తుతెలియన వాహనం ఢీకొని దుప్పి మృతి
చుంచుపల్లి: రామవరం అటవీ రేంజ్ పరిధిలోని పెనగడప ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని బుధవారం దుప్పి మృతి చెందింది. అటవీ ప్రాంతం నుంచి ప్రధాన రహదారి దాటుతుండగా భారీ వాహనం ఢీకొట్టి ఉండవచ్చునని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఎఫ్ఆర్ఓ సీహెచ్ శ్రీనివాసరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
చెరువులో పడి వ్యక్తి మృతి


