వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ● పదో తరగతి ఫలితాల మెరుగుకు సమీక్ష
సూపర్బజార్(కొత్తగూడెం): పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి ఉత్తీర్ణతా శాతం పెంపు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ప్రవేశాల పెంపు, పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాల మెరుగుదల తదితర అంశాలపై బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మితో కలిసి ఎంఈఓలు, ఏపీఎంలు, సంబంధిత శాఖల అధికారులతో ఆన్లైన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రీ ఫైనల్ పరీక్షల ఫలితాల ఆధారంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు రెండు రోజుల్లో గుర్తించి వివరాలు అందజేయాలన్నారు. ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గ్రామస్థాయిలో మహిళా సమాఖ్య సభ్యులు కూడా విద్యార్థుల విజయంలో భాగస్వాములు కావాలని చెప్పారు. అవసరమైతే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలిపారు. ఆకాంక్షిత విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రశ్నాపత్రాలు, పాఠ్యసామగ్రిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధం చేసి అందించాలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులను సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో అనుసంధానం చేయాలని, అందుబాటులో ఉన్న కోర్సులు, సౌకర్యాల వివరాలతో కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. పాఠశాలల్లో తాగునీటి సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన మరమ్మతులు తక్షణమే పూర్తి చేయాలని అన్నారు. ప్రతీ పాఠశాలలో బాలికల మరుగుదొడ్లు ఉండాలని ఆదేశించారు. 30 ఏళ్లలోపు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణుల వివరాలు, వారి ఉపాధి, వృత్తి సమాచారంతో వీఓఏలు సమగ్ర నివేదిక రూపొందించి అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, విద్యాశాఖ కోఆర్డినేటర్ సతీష్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.


