ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతా
● గుర్తించిన సమస్యలన్నీ పరిష్కరిస్తాం ● త్వరలో 60 డివిజన్లలో పర్యటిస్తా ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కొత్తగూడెం మేయర్ గణేశ్
కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలూ కృషి చేస్తానని, కార్పొరేషన్ను అభివృద్ధిపథంలో నడిపిస్తానని మేయర్ మూడ్ గణేశ్ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక సమస్యలు గుర్తించామని, వాటన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
సాక్షి: ప్రచార సమయంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు..?
మేయర్: ఎన్నికల ప్రచారంలో నేను పోటీ చేసిన డివిజన్లో ఇంటింటి పర్యటన సందర్భంగా పలు సమస్యలు గుర్తించాను. డివిజన్ పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జి లేక లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి కొంత ఏరియా ముంపునకు గురవుతోంది. అక్కడ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపడతా.
సాక్షి: సమస్యల పరిష్కారానికి మీకున్న ప్రణాళిక..?
మేయర్: సీసీ రోడ్డు, డ్రెయినేజీలతో పాటు బ్రిడ్జి నిర్మాణ అంశాలను పాలకవర్గ సమావేశంలో చర్చించి నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తా. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో పాటు సలహాలు, సూచనలతో కార్యాచరణ రూపొందిస్తాం.
సాక్షి: నగరాభివృద్ధి, ప్రధాన సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటారు..?
మేయర్: కార్పొరేషన్లో సమస్యలు పరిష్కారానికి ఎక్కువ నిధులు కేటాయిస్తాం. 60 డివిజన్లలో ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు త్వరలో అంతటా ప ర్యటిస్తా. తద్వారా ఎక్కువ సమస్యలు గుర్తించే అవకాశం ఉంటుంది. వాటన్నింటినీ పరిష్కరించి, ప్రజ లకు సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడతాం.
సాక్షి: కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినందున అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడతారు ?
మేయర్: కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆప్గ్రేడ్ కావడమే అభివృద్ధి. ఆ స్థాయికి తగ్గట్టుగా వసతుల కల్పనకు కృషి చేస్తాం. కార్పొరేషన్ పరిధిలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాను. ఎక్కడ ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తేవాలని ప్రజలను కోరుతున్నా.
సాక్షి: నగరంలో పాలనపై ప్రణాళిక ఏంటి..?
మేయర్: గతంలో ఎంపీటీసీగా చేసిన అనుభవం ఉంది. 2019 నుంచి ప్రజలకు దగ్గరగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నా. మండలంలో పాలనకు, ప్రస్తుతం కార్పొరేషన్లో 60 డివిజన్ల పాలనకు వ్యత్యాసం ఉంటుంది. డివిజన్లన్నింటికీ సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతా.
సాక్షి: పారిశుద్ధ్యం, తాగునీటి
సమస్యపై ఏం చేస్తారు..?
మేయర్: నగరంలో ప్రధానంగా పారిశుద్ధ్య, తాగునీటి సమస్య లేకుండా కార్యాచరణ రూపొందిస్తాం. నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తా. నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన ప్రజల, నాయకుల నమ్మకాన్ని వమ్ము చేయను.
ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతా


