యాప్తో పారదర్శకంగా ఎరువుల పంపిణీ
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో యూరియా బుకింగ్ యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి వి.బాబూరావు తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన వ్యవసాయాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుత వ్యవసాయ సీజన్లో యూరియా బుకింగ్ యాప్ను విజయవంతంగా అమలు చేస్తూ రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు యాప్లో నమోదైన వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో పట్టాదారు పాస్బుక్ ఉన్న రైతులు 5,008 మందికి గాను 5,036 బుకింగ్ల ద్వారా 23,125 యూరియా బస్తాలు బుక్ చేశారని, వాటిలో 15,773 బస్తాలు ఇప్పటికే కొనుగోలు చేశారని తెలిపారు. 46 మంది కౌలు రైతులు 48 బుకింగ్ల ద్వారా 227 బస్తాలు బుక్ చేయగా 172 బస్తాలు కొనుగోలు చేశారని చెప్పారు. జిల్లా మొత్తంగా 5,826 మంది రైతులు 5,859 బుకింగ్లు చేశారని, 27,782 బస్తాల యూరియా బుక్ చేయగా 19,173 బస్తాలు కొనుగోలు చేశారని వివరించారు. ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడం, అవసరానికి అనుగుణంగా యూరియా పంపిణీ చేయడంతో పాటు కౌలు రైతులకు కూడా ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ బుకింగ్లు ఉపయోగపడతాయని తెలిపారు. రైతులు అధి కారిక యాప్ ద్వారానే బుక్ చేయాలని, తద్వారా అందరికీ సమాన పంపిణీ, సకాలంలో సరఫరా, పారదర్శకత సాధ్యమవుతాయని అన్నారు.


