కొల్లూరు: అరటి గెలలు లోడుతో ప్రయాణిస్తున్న వాహనం స్టీరింగ్ విరిగిపోవడంతో పంట పొలాలలోకి దూసుకువెళ్లి పల్టీ కొట్టిన సంఘటన కొల్లూరు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. లంక గ్రామాల నుంచి అరటి గెలల లోడుతో వాహనం మిర్యాలగూడ బయలుదేరింది. కూలీలను వారి గ్రామంలో దింపేందుకు మండలంలోని కోటిపల్లి వెళుతుండగా కొల్లూరు సమీపంలోని మలుపు దాటిన అనంతరం అకస్మాత్తుగా స్టీరింగ్ విరిగిపోవడంతో అదుపు కోల్పోయి పంట పొలాల వైపు దూసుకుపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన కూలీలు పంట పొలాల్లోకి దూకివేయడంతో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పల్టీ కొట్టిన వాహనంలో నుంచి డ్రైవర్ సైతం క్షేమంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


