కార్మికుల హక్కుల కోసం పోరాటాలే శరణ్యం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కార్మికులు పోరాటాలు చేసి పాలక ప్రభుత్వాలు కార్పొరేట్, పెట్టుబడిదారుల భరతం పట్టాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని వెంకట రామారావు పేర్కొన్నారు. ఆదివారం కడప నగరంలో ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభల సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించి నేక్నామ్ కళాక్షేత్రంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గంపై ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం దాడి జరుగుతోందన్నారు. కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరించివేస్తున్నాయని చెప్పారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. దీంతో వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు యజమానులకు బానిసలుగా మారాల్సి వస్తుందని వివరించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనం పెరగడం లేదన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికవర్గంలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించిన బీజేపీ మతం ప్రాతిపదికన కార్మికులను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మతోన్మాదం, సరళీకరణ ఈ రెండూ దేశానికి ప్రమాదమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల కొత్త చట్టాన్ని సవరణ చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా వంటి స్కీమ్ వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించడం లేదని, కనీస వేతనాలు పెంచడం లేదన్నారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ కార్యక్రమాలకు ఇష్టం వచ్చినట్లు ఊపయోగించుకుంటూ వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారన్నారు. ఈ మహాసభలలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.సుబ్బరాయుడు, జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, ఎలక్ట్రిసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రామలింగారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా, ఉపాధ్యక్షులు మంజుల శ్రీరాములు, చాంద్బాషా, కార్యదర్శులు మద్దిలేటి, లింగన్న, మస్తాన్, వీఆర్ఎ సంఘం నాయకులు నాగేశం, ఈశ్వరయ్య, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు శివరాం, మల్లికార్జున గంగాసురేష్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల హక్కుల కోసం పోరాటాలే శరణ్యం


