అనంతపురమ్మ గుడిలో చోరీ
వాల్మీకిపురం : అనంతపురమ్మ గుడిలో చోరీ జరిగిన సంఘటన ఆదివారం చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. మంచూరు గ్రామ దేవత అనంతపురమ్మ గుడిలో 9 గ్రాముల బంగారు, రూ.5 వేల నగదు చోరీకి గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. గుడిలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, చోరీకి పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీంతో విచారణ చేపట్టి, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
లక్కిరెడ్డిపల్లి : మండల పరిధి కస్తూరిరాజుగారిపల్లి పంచాయతీలోని దేవలంపల్లికి చెందిన అరుణ (25) అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శోభ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. అరుణకు చిన్నమండెం మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం అయింది. భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయి దూరంగా ఉండటంతో.. ఊరిలో వారు ఏదో అనుకుంటారనే మనస్తాపంతో ఆదివారం ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
అన్న కుమార్తె వివాహం చూసి వెళ్తుండగా..
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాయచోటి టౌన్ : అన్న కుమార్తె వివాహం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో సదిపిరాళ్ల తువ్వపల్లె ధర్మారెడ్డి (45) అనే వ్యక్తి మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రామాపురం మండలం పత్తుకూరుపల్లెకు చెందిన సదిపిరాళ్ల తువ్వపల్లె బసిరెడ్డి కుమారుడు అయిన ధర్మారెడ్డి తన అన్న కుమార్తె వివాహం రాయచోటి పట్టణంలోని అభి ఫంక్షన్ హాల్లో శనివారం జరిగింది. ముహూర్తం ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ముహూర్తం అయిన తరువాత అదే గ్రామానికి చెందిన సదిపిరాళ్ల వెంకటసుబ్బారెడ్డి స్వగ్రామం (పత్తుకూరుపల్లె)కు వెళ్తుండగా ఆయన స్కూటర్పై ఎక్కారు. మాసాపేట సమీపానికి వెళ్లగా అక్కడ డీవైడర్ను ఢీకొట్టారు. దీంతో ధర్మారెడ్డికి తలకు బలమైన గాయాలు అయ్యాయి. వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి అప్పటికే మరణించినట్లు చెప్పారు. దీనిపై పూర్తి విచారణ సాగించి న్యాయం చేయాలని కోరినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతపురమ్మ గుడిలో చోరీ
అనంతపురమ్మ గుడిలో చోరీ


