వైఎస్ జగన్ కలిసిన వేమూరు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్ బాబు
రాధాకృష్ణ చెత్తపలుకులను సమర్ధించిన నక్కా ఆనందబాబును ప్రశ్నిస్తూ పోస్టు పెట్టాడని తనీష్ పై పోలీసుల వేధింపులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్ బాబు కలిశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్ధించడం ఎంతవరకు సమంజసం అంటూ తనీష్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
దీనిపై ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో చినపులివర్రులో కొల్లూరు ఎస్ఐ ఏడుకొండలు, మరికొందరు పోలీసులు తెల్లవారుజామున మఫ్టీలో గోడదూకి తన ఇంట్లోకి చొరబడి తనను వెంట తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారని వైఎస్ జగన్కు తనీష్ బాబు వివరించారు. ఎవరు మీరు, నా భర్తను ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నించిన తన భార్య అనూషపై, అడ్డుకున్న స్ధానికులపై దౌర్జన్యం చేసిన తీరును వైఎస్ జగన్కు ఆయన వివరించారు.

తనీష్బాబును అక్రమంగా తీసుకెళుతున్న సమాచారం తెలుసుకుని అప్పటికప్పుడు తాను చినపులివర్రు వెళ్ళి పోలీసుల దౌర్జన్యాన్ని నిలదీసినట్లు వేమూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు తెలిపారు. సోషల్ మీడియా కేసులలో నోటీసులు ఇవ్వకుండా వీధిరౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని ప్రశ్నించిన వైఎస్ జగన్.. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని మండిపడ్డారు.
తనీష్బాబుకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని.. తనీష్ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసిన వారిలో తనీష్ బాబు భార్య అనూష, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, చిలుమూరు రామ్మోహన్ రావు, సొంటి కామేశ్వరరావు, వసుమల్ల రోహిత్, అంబటి రామ్మోహన్ రావు ఉన్నారు.


