
తిరుపతి: తిరుపతిలో మళ్ళీ యధేచ్ఛంగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయని తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి మండిపడ్డారు. తెల్లవారుజాము నుంచే మద్యం దుకాణాలు బార్లా తెరుస్తున్నారని, 24 గంటల పాటు మద్యం దుకాణాల్లో అమ్మకాలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్సైజ్ అధికారుల ప్రోత్సాహంతోనే ఇది జరుగుతోందని, ఇలాంటి చర్యలు సహించేది లేదని హెచ్చరించారు భూమన.
తిరుపతిలో ఈ తరహా చర్యలను ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ, తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎక్సైజ్ ఎస్పీలకు విజ్ఞప్తి చేస్తున్నానని, రూల్స్కు విరుద్ధంగా సాగుతున్న మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. వీటిపై చర్యలు తీసుకోకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు భూమన.