కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలే.. ఔను.. మీరు విన్నది నిజమే
ఇదీ ఏపీలో రైతుల దుస్థితి... అగ్గిపెట్టె కంటే చౌక... ఒక బిస్కెట్ కంటే చౌక
రూ.లక్షల పెట్టుబడితో నెలల పాటు కష్టపడిన రైతులకు దక్కిన ప్రతిఫలం ఇంతే
అరటే కాదు... ఉల్లి నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు
విపత్తుల సమయంలో ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ హామీని తుంగలో తొక్కారు
మా ప్రభుత్వ హయాంలో అరటి పంట టన్నుకు సగటున రూ.25 వేల ధర దక్కింది
రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్రం నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశాం
రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలను అందుబాటులోకి తెచ్చాం.. మా నిబద్ధత వేలాది రైతు కుటుంబాలను కాపాడింది
కానీ, సీఎం చంద్రబాబు నేడు రైతులను వారి ఖర్మకు వదిలేశారు
వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకు పోతుంటే మౌనం వహిస్తున్నారు
ఆహారం 50 పైసలైతే... దానిని ఉత్పత్తి చేసే రైతుల శ్రమ విలువ ఎంత?
రాష్ట్ర రైతుల దుస్థితిని ప్రస్తావిస్తూ, చంద్రబాబు నిర్వాకాన్ని ఎండగట్టిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన ఫొటోలను ట్యాగ్ చేస్తూ ‘సేవ్ ఫార్మర్స్’ హ్యాష్ ట్యాగ్తో ‘ఎక్స్’లో పోస్టు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రైతులు పండించిన అరటి పండ్ల ధర కిలో కేవలం 50 పైసలు మాత్రమే పలుకుతుండడం, ఉల్లిపాయల నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు అవస్థ పడుతుండడాన్ని దేశం మొత్తానికి తెలియజేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పోస్టు చేశారు. అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన చంద్రబాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండడాన్ని సూటిగా ప్రస్తావిస్తూ తీవ్రంగా ధ్వజమెత్తారు.
అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు భారీఎత్తున ధర్నా చేస్తున్న ఫొటోలను ట్యాగ్ చేస్తూ ‘‘సేవ్ ఫార్మర్స్’’ హ్యాష్ట్యాగ్తో ‘‘హలో ఇండియా... ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఆ పోస్టులో ఆయన ఏమన్నారంటే..

‘‘హలో ఇండియా.. ఓ సారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి! కిలో అరటిపండ్లు కేవలం రూ.0.50కి అమ్ముడవుతున్నాయి! ఔను, మీరు విన్నది నిజమే, యాభై పైసలే. ఇదీ ఏపీలో అరటి రైతుల దుస్థితి.అగ్గిపెట్టె కంటే చౌక, ఒక బిస్కెట్ కంటే చౌక. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, నెలల తరబడి కష్టపడి పనిచేసిన రైతులకు దక్కిన దారుణమైన ప్రతిఫలం ఇది. అరటిపండ్లు మాత్రమే కాదు, ఉల్లిపాయల నుంచి టమాట వరకు, ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. విపత్తుల సమయంలో ఉచిత పంటల బీమా లేదా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని నమ్మబలికి మోసం చేశారు. చంద్రబాబు ప్రతి హామీ ఒక మోసమేనని నిరూపితమైంది.
📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!
One kilogram of bananas is being sold for just Rs 0.50!
Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.
Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025
⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అరటి పండ్లను టన్నుకు సగటున రూ.25 వేల ధరకు రైతులు అమ్ముకున్నారు. రైతులు ఎప్పుడూ నష్టపోకుండా చూసుకోవడానికి రాష్ట్రం నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశాం. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలు నిర్మించాం. నాటి మా నిబద్ధత వేలాది కుటుంబాలను కాపాడింది. గిట్టుబాటు ధరలకు పంటల ఉత్పత్తులను విక్రయించుకుని లబ్ధి పొందేలా రైతులకు తోడుగా నిలిచాం. కానీ నేడు చంద్రబాబు రైతులను వారి ఖర్మకు వదిలేశారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుంటే మౌనరాగం ఆలపిస్తున్నారు. నేడు ఆహారం విలువ 50 పైసలైతే దానిని ఉత్పత్తి చేసే రైతుల శ్రమ విలువ ఎంత?’’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.


