
ఇది రాజ్య హింస కాదా? పౌరులకు రక్షణ ఎక్కడ?
మండిపడిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి
వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా తప్పుడు కేసులు
కార్యకర్త హరికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?
దాచేపల్లి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు
టీడీపీ నేత కారులో పోలీస్స్టేషన్కు తీసుకెళ్తారా?
చంద్రబాబు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు..
బాధితుడికి న్యాయం జరిగే వరకు ఈ వ్యవహారాన్ని విడిచి పెట్టం
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా తప్పుడు కేసులతో బరితెగించి వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు శిశుపాలుని మాదిరి పాపాలు చేస్తున్నారని, వీటిని ప్రజలు ఎంత మాత్రం క్షమించరని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఎల్లయ్య కుమారుడు హరికృష్ణ పట్ల దాచేపల్లి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంత వరకు సమంజసం? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు? హరికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా? స్వయంగా టీడీపీ నేత కార్లో హరికృష్ణను తరలించి, స్టేషన్లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్లో దాచి పెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేయకపోతే అతడిని ఏం చేసేవారు?

ఎవరి ఆదేశాలతో, ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు? ఇది రాజ్య హింస కాదా? ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా? చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా? చంద్రబాబూ.. రెడ్బుక్ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఎంత మాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికీ తీసుకెళ్తాం. హరికృష్ణకు న్యాయం జరిగే వరకు ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టం’ అని ఆ పోస్ట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు.