- బాబు ఫేక్ ప్రచారాలు.. పీక్ పబ్లిసిటీ.. మా హయాంలోనే పారిశ్రామిక వృద్ధి
- ఆర్బీఐ నివేదిక సాక్షిగా చంద్రబాబు దుష్ప్రాచారం బద్ధలు: మాజీ సీఎం వైఎస్ జగన్
- 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు గ్రౌండ్ చేసిన పెట్టుబడులు రూ.50 వేల కోట్లు
- మా హయాంలో సాకారమైన భారీ పెట్టుబడులు ఏకంగా రూ.70 వేల కోట్లు
- మా ప్రభుత్వం ఒక్క ఎంఎస్ఎంఈల్లోనే 32,79,770 ఉద్యోగాలిచ్చిందని సాక్షాత్తూ చంద్రబాబు సర్కారు సామాజిక ఆర్థిక సర్వేనే చెబుతోంది
- పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఎగ్గొడుతున్న చరిత్ర బాబుదే
- దాదాపు రూ.8 వేల కోట్లు ప్రోత్సాహకాలు పెండింగ్లో పెట్టారు
- కప్పం కట్టకుండా పరిశ్రమలు కొనసాగే పరిస్థితి రాష్ట్రంలో లేదు
- సజ్జన్ జిందాల్ మొదలుకొని పారిశ్రామిక వేత్తలందరూ పారిపోతున్నారు
- తెలంగాణ, గుజరాత్ ప్రభుత్వాలు భూముల వేలం ద్వారా ఖజానాకు రూ.కోట్లు గడిస్తున్నాయి
- చంద్రబాబు మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలకు కారుచౌకగా భూములు దోచి పెడుతున్నారు
- లులు గుజరాత్లో రూ.519 కోట్లతో 16 ఎకరాలు కొనుగోలు చేస్తే..
- చంద్రబాబు విశాఖలో రూ.2 వేల కోట్ల భూమిని అప్పన్నంగా కట్టబెట్టారు
సాక్షి, అమరావతి: ‘అదానీ డేటా సెంటర్.. గూగుల్.. భోగాపురం ఎయిర్పోర్ట్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో చంద్రబాబు క్రెడిట్ చోరీ తెలిసిందే. ఆయన ఇంకో అడుగు కూడా ముందుకేసి.. మా హయాంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు వెళ్లిపోయారంటూ నిరంతరం బురదజల్లుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు..! దీనికి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, డజన్ల కొద్దీ అబద్ధాల ఫ్యాక్టరీలైన వాళ్ల సోషల్ మీడియా వంత పాడుతోంది..’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు.
నిజాలు గడప దాటేలోపే.. చంద్రబాబు అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసి వస్తాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేస్తున్న ఆ తప్పుడు ప్రచారాలను బద్ధలుకొడుతూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2025 డిసెంబర్ 11న ఒక నివేదిక విడుదల చేసిందని గుర్తు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్బీఐ నివేదికను పరిశీలిస్తే.. 2019–24 మధ్య వైఎస్సార్ సీపీ హయాంలో తయారీ రంగం జీవీఏ (స్థూల ఉత్పత్తి విలువ) వృద్ధిలో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో నిలిచిందని, దక్షిణాది రాష్ట్రాల్లో నాడు నంబర్ వన్గా ఉందని గుర్తు చేశారు.
‘మా హయాంలో తయారీ రంగంలో ఏపీ వృద్ధి రేటు 11.12 శాతం ఉంటే, దేశ సగటు వృద్ధి రేటు కేవలం 6.87 శాతం మాత్రమే. అంతేకాదు.. మా ఐదేళ్ల పాలనలో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటును గమనిస్తే దేశంలో 8వ స్థానంలో, దక్షిణాదిలో మళ్లీ మొదటి స్థానంలో నిలిచాం. దేశ సగటు 8.96 శాతం అయితే ఏపీలో 11.14 శాతం ఉంది. అయినాసరే చంద్రబాబు పైశాచిక ఆనందంతో నిత్యం మాపై టన్నుల కొద్దీ బురద వేస్తూనే ఉన్నారు. అసలు వాస్తవం ఏమిటంటే.. చంద్రబాబు హయాంలో పారిశ్రామిక వేత్తలు బెదిరి పారిపోతున్నారు..’ అని పేర్కొన్నారు.

కప్పం కడితేనే పరిశ్రమల మనుగడ..
సజ్జన్ జిందాల్, అరబిందో, మైహోమ్స్ సిమెంట్స్, శ్రీసిమెంట్స్, రామ్కో సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, షిర్డీసాయి.. వీళ్లందరూ చంద్రబాబు ఏలుబడిలో పరిశ్రమలను నడపలేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా.. కప్పం కట్టకపోతే పరిశ్రమలను నడిపే పరిస్థితి ఉందా? చంద్రబాబు ఈమధ్య మరో డ్రామా మొదలు పెట్టారు. కొత్త ఏడాది వేడుకలకు ఆయన, ఆయన కుమారుడు విదేశాలకు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో ప్రజలకు ఎలాగూ తెలియదు. పైపెచ్చు వీళ్ల పర్యటనను దాచిపెట్టే కార్యక్రమంలో భాగంగా ఎల్లో మీడియా కొత్త కొత్త సెన్సేషనల్ అబద్ధాలను క్రియేట్ చేస్తోంది. పారిశ్రామిక ప్రతిపాదనల్లో దేశంలో ఏపీ నంబర్ 1 అంటూ కొత్త వక్రీకరణ తీసుకొస్తోంది. అదంతా కేవలం పబ్లిసిటీ మాత్రమే. రియాలిటీ కాదు.
ఎంఎస్ఎంఈల్లో 32.79 లక్షల ఉద్యోగాలు కల్పించాం
వంటవారికి, డ్రైవర్లకు సూటూ బూటూ వేసి కూర్చోబెట్టడం.. ఎంవోయూలు రాయడం.. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటూ ప్రకటించుకోవడం చంద్రబాబుకు అలవాటే. 2014–19 మధ్య కూడా ఇలాంటి కథలే విన్నాం. ఆర్టీఐ ద్వారా వెల్లడించిన సమాచారం చంద్రబాబు పారిశ్రామిక పబ్లిసిటీ గుట్టును బయటపెట్టింది. 2014–19 మధ్య భారీ పరిశ్రమల్లో రూ.50,708 కోట్లు పెట్టుబడులు క్షేత్రస్థాయిలో కనిపిస్తే దాని ద్వారా 84,333 ఉద్యోగాలు కల్పించారు. అదే మా హయాంలో 2019–24 మధ్య చూస్తే.. దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.
అది గతంలో కంటే 25 శాతం అధికం. దీంతో పాటు 90,230 ఉద్యోగాలు కల్పించాం. ఇక ఎంఎస్ఎంఈలు చూసినా మేం ఐదేళ్లలో 32,79,770 ఉద్యోగాలిచ్చాం. ఇది మేం చెబుతున్నది కాదు.. ఆ విషయం సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వం రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ (సామాజిక ఆర్థిక) సర్వే రిపోర్ట్లోనే ఉంది. చంద్రబాబు ఇచి్చన ఎంఎస్ఎంఈ ఉద్యోగాలు కేవలం దాదాపు 9.50 లక్షలు మాత్రమే. మరి ఇప్పుడు చెప్పండి.. ఎవరి హయాంలో విధ్వంసం జరిగింది? ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు? ఎవరి హయాంలో పారిశ్రామిక వేత్తలకు ఊరట, భరోసా లభించింది?
కమీషన్లు ఇస్తేనే ప్రోత్సాహకాలు!
పారిశ్రామిక ప్రోత్సాహకాల్లో ఒక్క ఎంఎస్ఎంఈ విభాగంలోనే చంద్రబాబు దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా పెండింగ్ పెట్టారు. ఆ ప్రోత్సాహకాలు ఇచ్చే నాథుడు లేడు. పట్టించుకునే నాథుడు కనిపించట్లేదు. మొత్తంగా చూస్తే దాదాపు రూ.8 వేల కోట్లకుపైగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు పెండింగ్లో ఉన్నాయి. అవి ఇవ్వాలంటే.. రెండు బకెట్లు పెట్టారట! ఒక బకెట్లో.. 30 శాతం ఎవరు కమీషన్ ఇస్తే వారి పేరు పెడతారట! రెండో బకెట్లో న్యూట్రల్గా (తటస్థం) కనిపించడానికి కేవలం 20 శాతం మాత్రం పెడతారట! కొంతమందిని ఎంపిక చేసి 20 శాతం సొమ్ము ఇస్తారట! ఇలా ప్రోత్సాహకాల్లోనూ దోపిడీ చేస్తుంటే ఇంకేం పరిశ్రమలు వస్తాయి? చంద్రబాబు గతంలో మాదిరిగానే ఈదఫా కూడా పెట్టుబడులపై పీక్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ చేసేవన్నీ స్కామ్లే! పేరుకు ఒకట్రెండు పెద్ద కంపెనీలకు ఉచితంగా, 99 పైసలకే భూములిస్తున్నట్లు ప్రకటించి ఆ ముసుగులో రూ.వేల కోట్ల విలువైన భూములను తన బినామీలకు కారుచౌకగా దోచిపెడుతున్నారు. పెద్ద కంపెనీల పేర్లతో పబ్లిసిటీ చేసుకుని మరో మార్గంలో ఎల్లయ్యలకో, పుల్లయ్యలకో, తన బినామీలకు అప్పనంగా కట్టబెడుతున్నారు.
రియల్ ఎస్టేట్ కంపెనీలకు కారుచౌకగా భూములు!
సత్వా గ్రూపు, కపిల్ గ్రూపు, ఏఎన్ఎస్ఆర్ గ్రూపు.. తదితర రియల్ ఎస్టేట్ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి వేలం లేకుండానే భూములు ఇచ్చేస్తోంది. పొరుగున తెలంగాణలో చూస్తే ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఎకరా భూమి రూ.170 కోట్లు పలికింది. గుజరాత్లోనూ ఇలానే ప్రభుత్వం వేలంలో భూమిని కేటాయిస్తూ ఖజానాకు నిధులు సమకూర్చుకుంటోంది. మన రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు దోచిపెడుతున్నారు. ఎకరా రూ.50 కోట్లు విలువైన భూములను కేవలం రూ.1.50 కోట్లకే ఇచ్చేశారు.
సత్వాకు 30 ఎకరాలు, కపిల్ చిట్ ఫండ్స్కు 10 ఎకరాలు, ఏఎన్ఎస్ఆర్కు 10 ఎకరాలు.. రహేజాకు అయితే మరీ 99 పైసలకే కట్టబెట్టేశారు. ఒకవైపు ఎలాంటి వేలం లేకుండానే భూములు కారుచౌకగా ఇవ్వడమే కాకుండా.. మరోవైపు ల్యాండ్ యూజ్ (భూమి వినియోగం) 40–50 శాతం మిక్స్డ్ యూజ్ చేసుకునేందుకు స్వేచ్ఛ ఇచ్చారు. మరోవైపున వీళ్లు బిల్డింగులు కడితే.. ఎస్ఎఫ్టీకి రూ.2 వేలు తిరిగి ప్రభుత్వమే వెనక్కి డబ్బులిచ్చేలా భారీ స్కామ్కు తెరదీశారు. ఇది నిజంగా బొనాంజా కాదా? రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడికి ఎవరైనా ఈ మాదిరిగా ఇస్తారా?
విశాఖలో లూలుకు రూ.2 వేల కోట్ల భూమి
విశాఖపట్నంలో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన 14 ఎకరాల భూమిని 99 ఏళ్లకు లూలు గ్రూప్నకు లీజుకిచ్చారు. ఎలాంటి టెండరూ లేదు.. ఎలాంటి వేలం లేదు. కేవలం కంపెనీ రాసిన లెటర్ ఆధారంగా ఈ భూములు వాళ్లు మాల్ కట్టుకోవడానికి ఇచ్చేశారు. ఇదే లూలు గ్రూపు అహ్మదాబాద్లో 16 ఎకరాల భూమిని రూ.519 కోట్లకు వేలంలో కొనుగోలు చేసి మాల్ కడుతోంది. ఆంధ్రాలో మాత్రం ఉచితంగా, వేలం లేకుండా చంద్రబాబు ఇచ్చేస్తున్నారు. అహ్మదాబాద్లో లూలుకు కేటాయించిన భూమి వేలంలో రూ.519 కోట్లు ధర పలకడంతో పాటు రికార్డు స్థాయిలో రూ.31 కోట్లు స్టాంపు డ్యూటీ కింద వచ్చిందంటూ ఆ రాష్ట్రం క్రెడిట్ తీసుకుంటోంది. (ఆంగ్ల పత్రిక కథనాన్ని చూపించారు)
⇒ చంద్రబాబు గతంలో మాదిరిగానే ఈదఫా కూడా పెట్టుబడులపై పీక్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ చేసేవన్నీ స్కామ్లే! పేరుకు ఒకట్రెండు పెద్ద కంపెనీలకు ఉచితంగా, 99 పైసలకే భూములిస్తున్నట్లు ప్రకటించి ఆ ముసుగులో రూ.వేల కోట్ల విలువైన భూములను తన బినామీలకు కారుచౌకగా దోచిపెడుతున్నారు. పెద్ద కంపెనీల పేర్లతో పబ్లిసిటీ చేసుకుని మరో మార్గంలో ఎల్లయ్యలకో, పుల్లయ్యలకో, తన బినామీలకు అప్పనంగా కట్టబెడుతున్నారు...
⇒ వంటవారికి, డ్రైవర్లకు సూటూ బూటూ వేసి కూర్చోబెట్టడం.. ఎంవోయూలు రాయడం.. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటూ ప్రకటించుకోవడం చంద్రబాబుకు అలవాటే. 2014–19 మధ్య కూడా ఇలాంటి కథలే విన్నాం. ఆర్టీఐ ద్వారా వెల్లడించిన సమాచారం చంద్రబాబు పారిశ్రామిక పబ్లిసిటీ గుట్టును బయటపెట్టింది. 2014–19 మధ్య భారీ పరిశ్రమల్లో రూ.50,708 కోట్లు పెట్టుబడులు క్షేత్రస్థాయిలో కనిపిస్తే 84,333 ఉద్యోగాలు కల్పించారు. అదే మా హయాంలో 2019–24 మధ్య చూస్తే.. దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అది గతంలో కంటే 25 శాతం అధికం. దీంతో పాటు 90,230 ఉద్యోగాలు కల్పించాం. ఇక ఎంఎస్ఎంఈలు చూసినా మేం ఐదేళ్లలో 32,79,770 ఉద్యోగాలిచ్చాం. ఈ విషయం సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వం రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ (సామాజిక ఆర్థిక) సర్వే రిపోర్ట్లోనే ఉంది.
⇒ ఇటీవల ఆర్బీఐ నివేదికను పరిశీలిస్తే వైఎస్సార్సీపీ హయాంలో తయారీ రంగం జీవీఏ (స్థూల ఉత్పత్తి విలువ) వృద్ధిలో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో నాడు నంబర్ వన్గా ఉంది. మా హయాంలో తయారీ రంగంలో ఏపీ వృద్ధి రేటు 11.12% ఉంటే, దేశ సగటు వృద్ధి రేటు కేవలం 6.87% మాత్రమే. మా ఐదేళ్ల పాలనలో పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటును గమనిస్తే దేశంలో 8వ స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానంలో నిలిచాం. దేశ సగటు 8.96% అయితే ఏపీలో 11.14% ఉంది. అయినా చంద్రబాబు పైశాచిక ఆనందంతో నిత్యం మాపై టన్నుల కొద్దీ బురద వేస్తూనే ఉన్నారు. – వైఎస్ జగన్


