
నెల్లూరు టౌన్: వర్షం కారణంగా సంగం మండలంలోని కొరిమెర్ల ఉన్నత పాఠశాల ఉరుస్తుందని తలపై ప్లేట్లు పెట్టుకొని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఓ పత్రికలో వచ్చిన కథనం దాని దిగుజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. తలపై ప్లేట్లు పెట్టుకోమని అమాయకులైన బాలబాలికలకు చెప్పి ఫొటోలు తీసుకుని తప్పుడు రాతలు రాసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విమర్శిస్తున్నా రు.
పాఠశాలలోని భోజన శాలలో ఎంతటి తుపాన్, వర్షం వచ్చినా నీరు కారే అవకాశమేలేదని చెబుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా బుధవారం జోరు వర్షం వస్తున్నా.. పిల్లలను భోజనశాలలో కూర్చోబెట్టి భోజనం పెడుతున్న ఫొటోలను విద్యాశాఖ మీడియాకు విడుదల చేసింది. మంగళవారం జోరు వర్షం వస్తుండడంతో పిల్లలు వేరే దారి నుంచి భోజనశాలకు వచ్చారని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు కథనాలు రాసే పచ్చపత్రికపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
అభూత కల్పన
కొరిమెర్ల పాఠశాలలో వర్షం వస్తే వరండాలో ఓ వైపు ఉరుస్తుంది. పాఠశాలలోని గదుల నుంచి భోజన శాలకు వెళ్లే దారిలో ఎక్కడా వర్షం పడదు. దీని వల్ల తలలపై ప్లేట్లు పెట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఓ పత్రిక విలేకరి పిల్లలను తప్పుదోవ పట్టించి ఆ దారిన తీసుకెళ్లి ఫొటోలు తీసి వార్త రాశారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
– జానకిరామ్, కొరిమెర్ల,జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ, సంగం