
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): మూడేళ్ల చిన్నారిపై తల్లి పైశాచికంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విజయవాడ పరిధిలోని జక్కంపూడి కాలనీలో నివసించే వందనకు (23) అమ్ములు అనే మూడేళ్ల పాప ఉంది. కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది.
శ్రీరాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో వందన, శ్రీరాములు హైదరాబాద్కు మకాం మార్చారు. తమ ఆనందానికి పాప అడ్డుగా ఉందని భావించిన వారు.. ఆ చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. వంటిపై, వీపుపై ఇష్టానుసారంగా వాతలు పెట్టడంతో ఆ చిన్నారి కేకలు వేసేది.
కేకలు బయటకు రాకుండా నోరు మూసి ఈ అకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం విజయవాడ వచ్చిన వందన, శ్రీరాములు పాపను రైల్వే స్టేషన్లో వదిలేశారు. విషయం తెలుసుకున్న శ్రీరాములు తల్లి సుమలత రైల్వేస్టేషన్కు వెళ్లి అమ్ములును ఇంటికి తీసుకొచ్చింది. కాగా, ఈ అకృత్యాలు తెలుసుకున్న స్థానికులు విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.