
రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు నుంచి తెలంగాణ వరకు రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు నుంచి తెలంగాణ వరకు రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు) శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో 13 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. జూపాడు బంగ్లా మండలంలో 11.5, అన్నమయ్య జిల్లా బీరొంగి కొత్తకోట మండలంలో 10.6, అనంతపురం జిల్లా డి.హీరేలాల్ మండలంలో 10.4, విడపనకల్ మండలంలో 10.2, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో 8.8, కర్నూలు అర్బన్, అన్నమయ్య జిల్లా కలికిరి మండలంలో 8.3, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో 7.4, అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలంలో 7.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరో 3 రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.