చంద్రబాబు ద్రోహంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రేపు చలో పోతిరెడ్డిపాడుకు సర్వంసిద్ధం
రాయలసీమ ఎత్తిపోతలను పూర్తిచేయాలని డిమాండ్
‘సీమ’ సుభిక్షం కోసం రూ.3,850కోట్లతో ఎత్తిపోతల పనులు చేపట్టిన వైఎస్ జగన్
పథకాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు కుయుక్తులు
అధికారంలోకి రాగానే తెలంగాణ సీఎం రేవంత్తో బాబు చీకటి ఒప్పందం
తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేసిన ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి
ప్రజాగ్రహంతో రాయలసీమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదని బాబు సర్కారు వితండవాదం
రాయలసీమను సుభిక్షం చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కక్ష పెంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే తన వక్రబుద్ధిని చాటారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంతో పథకం నిర్మాణాన్ని నిర్దాక్షిణ్యంగా ఆపేశారు.
సీమకు తీరని ద్రోహం చేశారు. మాతృభూమి గుండెలపై తన్నారు. ప్రజలకు తీరని వేదన మిగిల్చారు. చంద్రబాబు చేసిన ద్రోహంపై సీమ భగ్గుమంటోంది. ఆయన తీరుపై ప్రజానీకం దుమ్మెత్తిపోస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం చలో పోతిరెడ్డిపాడుకు సిద్ధమైంది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సీమకు జరిగిన అన్యాయంపై ఎలుగెత్తనుంది. – సాక్షి ప్రతినిధి, కర్నూలు
‘సీమ’ తాగు, సాగు నీటి కష్టాలు తీర్చాలని, సీమ ప్రజల భవిష్యత్తు బాగుండాలని కాంక్షించి ముందు చూపుతో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బృహత్తర పథకం రాయలసీమ ఎత్తిపోతల. ఈ పథకం ‘సీమ’జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా రైతుల తలరాత మారుస్తుంది.
పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ను 11వేల క్యూసెక్కుల నుంచి 44వేల క్యూసెక్కులకు పెంచి వైఎస్ రాజశేఖరరెడ్డి(వైఎస్సార్) సీమకు మేలు చేస్తే.. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘సీమ’ తాగు, సాగు నీటి కష్టాలను శాశ్వతంగా నివారించేందుకు శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీలను పోతిరెడ్డిపాడు కాలువలోకి ఎత్తిపోసేందుకు రాయలసీమ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. కానీ చంద్రబాబు మాత్రం వైఎస్ జగన్కు పేరు వస్తుందనే అక్కసుతో ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్’ పనులను ఆపేసి ‘సీమ’కు తీరని ద్రోహం చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల ఆవశ్యకత ఇదీ..
శ్రీశైలం ప్రాజెక్టును ‘సీమ’వాసుల త్యాగాలతో 1981లో నిర్మించారు. 1983–84 నుంచి 2003–04 వరకూ శ్రీశైలం నుంచి రోజుకు 11వేల క్యూసెక్కుల చొప్పున మాత్రమే సీమకు నీటిని తరలించే సామర్థ్యం మాత్రమే ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. 854 అడుగులకు నీటి మట్టం చేరుకున్నప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. అది కూడా రోజుకు 7వేల క్యూసెక్కులు మాత్రమే తరలించవచ్చు. దీంతో ‘సీమ’కు కృష్ణాజలాలు తరలింపునకు తీవ్ర ఇబ్బంది ఉండేది.
2004 వరకూ అప్పటికే తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏ రోజూ ‘సీమ’ బాగు గురించి ఆలోచించలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచారు. దీంతో సీమకు కృష్ణాజలాలు తరలింపు సులువైంది. అయితే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే రోజుకు 2 టీఎంసీలు తరలించుకునేలా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల చేపట్టింది.
నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతలతో పాటు పలు మార్గాల ద్వారా రోజుకు కృష్ణాజలాలు శ్రీశైలం చేరుకోక మునుపే రోజుకు 8 టీఎంసీలు ఎత్తిపోసుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించింది. ఇదే క్రమంలో కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం సామర్థ్యం కూడా 129 టీఎంసీల నుంచి, 229 టీఎంసీలకు పెంచేందుకు అక్కడి సర్కారు ఉపక్రమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ‘సీమ’ ఎడారిగా మారే పరిస్థితి. పైగా శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కులు తీసుకోవచ్చు! అంతకు తక్కువ ఉంటే పూర్తిస్థాయి నీటిని తీసుకోలేం.
854 అడుగుల కంటే ఒక అడుగు తక్కువ ఉన్నా పోతిరెడ్డిపాడు నుంచి ఒక చుక్క నీరు అందదు. ఈ మొత్తం పరిణామాలను నిశితంగా పరిశీలించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మనకు రావల్సిన నీటిని 800 అడుగుల నుంచే తీసుకునేలా పోతిరెడ్డిపాడు దిగువన ‘రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని’ చేపట్టి నీటిని పోతిరెడ్డిపాడు కాలువలో ఎత్తిపోసేలా పనులు చేపట్టారు. దీంతో శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకు చేరుకోకపోయినా, తెలంగాణ 800 అడుగుల నుంచే ఎత్తిపోసినా మనం భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే మనం కూడా 800 అడుగుల నుంచే మనకు హక్కుగా రావల్సిన నీటిని దక్కించుకోవచ్చు. ఈ కారణంతోనే రాయలసీమ ఎత్తిపోతలకు జగన్ శ్రీకారం చుట్టారు.
తెలంగాణ టీడీపీ సానుభూతిపరులతో కోర్టులో కేసులు
రాయలసీమ ఎత్తిపోతలను రూ.3,850 కోట్ల అంచనాతో 2020 మే 5న అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందని, తన రాజకీయ మనుగడ ప్రమాదంలో పడుతుందనే విద్వేషంతో చంద్రబాబు నాయుడు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోని టీడీపీ సానుభూతి పరులతో ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)లో కేసులు వేయించారు. ఎన్జీటీ అనుమతి తీసుకున్న తర్వాతే పనులు చేపట్టాలని 2020 అక్టోబర్ 29న ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది.
అయితే తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు ఎన్జీటీ అనుమతి ఉందని, ఆ ప్రాజెక్టుల కిందే చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలకు మళ్లీ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని ట్రిబ్యునల్లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టిగా వాదించింది. ఓవైపు ఎన్జీటీ అనుమతుల కోసం యత్నిసూ్తనే మరోవైపు పనులు ఆపకుండా పరుగులు పెట్టించింది. 2024 మే వరకు వేగంగా పనులు జరిగాయి. అప్పటికి రూ.990 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది.
చంద్రబాబు సర్కారు వితండవాదం
రేవంత్, చంద్రబాబు చీకటి ఒప్పందం బట్టబయలు కావడంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు సర్కారు వితండవాదానికి దిగింది.. శ్రీశైలంలో 840 అడుగుల దిగువన 34 టీఎంసీలే ఉంటాయని, అందులో ఏపీ వాటా 22 టీఎంసీలేనని, ఆ నీటిని తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల అవసరం లేదని ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడుతో ప్రకటన చేయించింది. ఈ వాదన పూర్తిగా అవాస్తవమని సాగునీటి రంగ నిపుణులూ స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు రేపే చలో పోతిరెడ్డిపాడు
‘సీమ’కు చంద్రబాబు చేస్తున్న తీరని ద్రోహంపై వైఎస్సార్ సీపీ పోరాటం చేపట్టింది. ఈ నేపథ్యంలో గురువారం చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి పిలుపునిచి్చంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు, ప్రజలు, మేధావులు, నిపుణులు, ప్రజాసంఘాల నేతలు, సీమ రైతులు ఈ కార్యక్రమానికి భారీగా తరలిరానున్నారు. ఈ క్రమంలో చలో పోతిరెడ్డిపాడు పోస్టర్లను వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు అన్ని నియోజకవర్గాల్లో ఆవిష్కరించారు.
బాబు ముఖ్యమంత్రి కావడమే ‘సీమ’కు శాపమా?!:
2024 మే వరకూ జరిగిన పనులు ఆ తర్వాత జూన్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక గ్రహణం పట్టింది. చంద్రబాబు సీఎం అయ్యాక 2025 జనవరి 1న కేంద్ర అటవీ, పర్యావరణశాఖ ఈఏసీ (ఎక్సపర్ట్ అప్రైజల్ కమిటీ) ఏపీ జలవనరులశాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. రాయలసీమ ఎత్తిపోతల ఆవశ్యకతపై సమర్థంగా వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైంది.
కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అడిగిన సమాచారాన్నీ 2025 ఫిబ్రవరి 27న నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరి 4న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగిస్తూ ‘చంద్రబాబుతో ఏకాంతంగా జరిగిన సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలని అడిగానని, తన కోరికను ఆయన మన్నించారని తమ మధ్య జరిగిన చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేశారు. దీంతో బాబు వక్రబుద్ధి బయట పడింది.


