20 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై రూ.3.27 లక్షల కోట్ల అప్పుల భారం
ఎక్కడ అప్పు పుడితే అక్కడ తేవడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన
మంగళవారం మరో రూ.3,300 కోట్ల అప్పు
దీంతో బడ్జెట్ పరిధిలోని అప్పులే రూ.1,79,168 కోట్లకు చేరిక
బడ్జెట్ బయట అప్పులు మరో రూ.1.48 లక్షల కోట్లు
అయినా సూపర్ సిక్స్ అమలు చేయడం లేదు..
ప్రభుత్వ ఆస్తుల కల్పన లేనే లేదు
అప్పు తెచ్చిన మొత్తం తమ జేబుల్లోకి మళ్లించుకుంటున్న ప్రభుత్వ కీలక నేతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ఆర్థిక నిర్వహణ వైఫల్యంతోపాటు అస్తవ్యస్త పాలనతో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం దిశగా పయనిస్తోంది. రెండేళ్లు కూడా కాకుండానే రాష్ట్రాన్ని చంద్రబాబు రుణ విస్ఫోటనంలోకి నెట్టేశారు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పు తేవడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోంది. అప్పు తెచ్చిన డబ్బులను సూపర్ సిక్స్తోపాటు ప్రజలకిచ్చిన హామీల అమలుకు ఖర్చు చేయడం లేదు.
అలాగే ప్రభుత్వ ఆస్తుల కల్పనకు వ్యయం చేయడం లేదు. అప్పు తెచ్చిన సొమ్ము మొత్తం తమ జేబుల్లోకి వచ్చేలా ప్రభుత్వంలోని కీలక నేతలు మళ్లించేస్తున్నారు. చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేవలం 20 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.3,27,725 కోట్ల అప్పుల భారాన్ని మోపారు. అంటే... సగటున నెలకు రూ.16,386 కోట్లు, రోజుకు రూ.546.20 కోట్లు చొప్పున అప్పు చేస్తున్నారు.
బడ్జెట్ బయట అప్పులు చేసేందుకు కొత్తగా కార్పొరేషన్లను, స్పెషల్ పర్పస్ వెహికల్స్(ఎస్పీవీలు) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఖజానా ఆదాయాన్ని వాటికి మళ్లించి మరీ రాజ్యాంగ సూత్రాలు, నియమావళికి విరుద్ధంగా చంద్రబాబు సర్కారు గ్యారెంటీలు ఇస్తూ అప్పుల మీద అప్పులు చేస్తోంది. సహజ సంపద అయిన గనులను తాకట్టుపెట్టడంతోపాటు మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి మరీ అప్పు చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ భూములను, వివిధ సంస్థల ఆస్తులను సైతం తాకట్టు పెట్టి దొరికిన చోటల్లా అప్పులు తీసుకుంటోంది.
మళ్లీ రూ.3,300 కోట్ల అప్పు
మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ 7.71 శాతం వడ్డీతో రూ.3,300 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించింది. దీంతో బడ్జెట్ అప్పులే రూ.1,79,168 కోట్లకు చేరాయి. ఇవికాక బడ్జెట్ బయట అప్పులు మరో రూ.1,48,557 కోట్లకు చేరాయి.
ఇందులో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో తెచ్చిన అప్పులు రూ.1,01,170 కోట్లు. రాజధాని పేరుతో చేస్తున్న అప్పులు రూ.47,387 కోట్లకు చేరాయి. దీంతో రెండేళ్లు కాకుండానే రాష్ట్రాన్ని రూ.3,27,725 కోట్ల అప్పుల ఊబిలో చంద్రబాబు సర్కారు ముంచేసింది.


