
విశాఖ : వాటర్ సప్లై ఉద్యోగులు చేస్తున్న సమ్మె విశాఖలో తీవ్రరూపం దాల్చింది. నగరంలోని జీవీఎంసీ(గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్) పరిధిలో 18 గంటలుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తాయి. ప్రధానంగా పరిశ్రమలు, ఆసుపత్రులకు నీటి సరఫరా లేకపోవడంతో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
తమ డిమాండ్ను తీర్చే వరకూ సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగులు హెచ్చరికలు చేస్తుండగా, మరొకవైపు మీ ఉద్యోగాలు పీకేస్తాం అంటూ మేయర్ బెదిరింపులతో సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. తమను ఉద్యోగాల నుంచి తీసేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉద్యోగులు మరో అడుగు ముందుకేసి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం కావడంతో ఇప్పటికీ నీటి సరఫరా సమస్యను ఎదుర్కొంటున్నారు విశాఖ వాసులు.
తమ జీతాలు పెంచలేదంటూ ఉద్యోగులు సమ్మెకు దిగారు. జీవీఎంసీ పరిధిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 1250 మంది వాటర్ సప్లై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. నిన్నటి నుంచి నీటి సరాఫరాను జీవీఎంసీ నిలిపివేసింది. ఇప్పటికే కేజీహెచ్, ఎయిర్ పోర్ట్కు నీటి సరాఫరా నిలిచిపోయింది. 11వ తేదీ నుంచి సమ్మె చేస్తామని నీటి సరఫరా ఉద్యోగులు హెచ్చరించిన కానీ అధికారులు పట్టించుకోలేదు. దాంతో వారంతా సమ్మె బాట పట్టారు.