సాక్షి, తాడేపల్లి: గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధ్యక్షుడిగా స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వారికి ఎదురు నిలబడి వడ్డే ఓబన్న చూపిన తెగువను నాయకులు గుర్తుచేసుకున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమాన్ని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

వడ్డే ఓబన్న చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు వడ్డె రామదాసు వంటి వడ్డెర నాయకులను ఈ సందర్భంగా కీర్తించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వడ్డెర సంక్షేమం కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన కృషిని రాజకీయంగా ఇచ్చిన ప్రాధాన్యతను ఈ సందర్భంగా గుర్తుచేసుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఒక ఎమ్మెల్యే సీటుతో పాటు మాచర్ల, చీమకుర్తి, పులివెందుల మున్సిపాలిటీలకు చైర్మన్లుగా గుంటూరు జెడ్పీ వైయస్ చైర్ పర్సన్గా వడ్డెర కులస్తులకు అవకాశం కల్పించిన వైఎస్ జగన్ రుణం రాబోయే ఎన్నికల్లో తీర్చుకుంటామని చెప్పారు. వడ్డెర కులస్తులతో వైఎస్ కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని, వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రోత్సహిస్తే.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక కూడా మరింత ముందుకు తీసుకెళ్లారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ, పార్టీ కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు జిల్లా జెడ్పీ వైఎస్ చైర్పర్సన్ బత్తుల అనూరాధ, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, పార్టీ బీసీ సెల్ జనరల్ సెక్రటరీ బత్తుల రామారావు, చిత్తూరు జిల్లా పార్టీ సోషల్ మీడియా అడ్వైజర్ పవన్, హైకోర్టు అడ్వకేట్ బేబీ రాణి, వివిధ పార్టీ అనుబంధ విభాగాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.


