పొగాకు రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం | Tobacco farmers meet YS Jagan: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పొగాకు రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం

Jan 30 2026 5:39 AM | Updated on Jan 30 2026 5:39 AM

Tobacco farmers meet YS Jagan: Andhra pradesh

వైఎస్‌ జగన్‌కు వినతి పత్రం అందిస్తున్న పొగాకు రైతులు

పొగాకు రైతులకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా

సాక్షి, అమరావతి/జంగారెడ్డిగూడెం: పొగాకు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ను గురువారం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన పొగాకు రైతులు కలిశారు. కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకు, సిగరెట్లపై విధించిన అధిక ఎక్సైజ్‌ డ్యూటీ, జీఎస్టీ పెంపు వల్ల పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్‌ జగన్‌ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. దీనివల్ల పొగాకుకు డిమాండ్‌ తగ్గి, ధరలు పడిపోతాయని, కొనుగోళ్లు తగ్గి, తమ జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారని వివరించారు.

ఇప్పటికే పలు జిల్లాల్లో పొగాకు రైతులు నిరసనలు చేపడుతూ, పన్నులు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. పొగాకు రైతులు ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభాన్ని, వారిలో నెలకొన్న ఆందోళనలను వైఎస్సార్‌సీపీ... కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మేలు జరిగేలా చూస్తుందని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లోనే వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఈ అంశాన్ని చర్చిస్తారని తెలిపారు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు, ఎన్‌ఎల్‌ఎస్‌ వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు సత్రం వెంకటరావు, ఉపాధ్యక్షుడు అట్లూరి సతీష్, సెక్రటరీ సత్యనారాయణ, రైతు నాయకులు సత్తెనపల్లి వీర్రాజు, వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు జెట్టి గుర్నాథరావు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement