సహ ఉద్యోగులే తోడేళ్లై.. చంద్రగిరిలో అరాచకం | Tirupati Chandragiri Incident Full Details | Sakshi
Sakshi News home page

సహ ఉద్యోగులే తోడేళ్లై.. చంద్రగిరిలో అరాచకం

Jun 19 2025 7:56 AM | Updated on Jun 19 2025 9:58 AM

Tirupati Chandragiri Incident Full Details

లైంగిక వేధింపుల బాధితురాలి పట్ల కర్కశం  

ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ దౌర్జన్యం  

భరించలేక దళిత ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
 

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మిట్టపాళెం సచివాలయంలో వెల్ఫేర్‌ ఆసిస్టెంట్‌ గుణశేఖర్‌ లైంగిక వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత ఉద్యోగినిపై సహోద్యోగులే తోడేళ్లై వేధించారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారి వేధింపులు భరించలేక దళిత ఉద్యోగిని బుధవారం సచివాలయంలోనే బలవన్మరణానికి యత్నించారు.

బాధితురాలి కథనం ప్రకారం.. చంద్రగిరి మండలం మిట్టపాళెం సచివాలయంలో కొద్ది రోజులుగా వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ గుణశేఖర్‌ లైంగికంగా వేధిస్తుండడంతో తట్టుకోలేని దళిత ఉద్యోగిని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఆమె విధులకు హాజరు కాగానే కార్యాలయంలోని డిజిటల్‌ అసిస్టెంట్, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశావంటూ గొడవకు దిగారు. మర్యాదగా ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరించారు. ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదు చేసి ఉద్యోగం లేకుండా చేస్తామంటూ భయపెట్టారు. కేసును వెనక్కు తీసుకుంటేనే సచివాలయంలోకి అనుమతిస్తామని హెచ్చరించారు.

దీంతో బాధితురాలు ఫోన్‌ ద్వారా ఎంపీడీఓకు సమాచారం అందించారు. మండల అధికారులు సచివాలయానికి చేరుకునే లోపే సహోద్యోగుల వేధింపులు భరించలేక దళిత ఉద్యోగిని నిద్రమాత్రలు మింగేసి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ఆమెను మిగతా సిబ్బంది హుటాహుటిన 108 వాహనంలో చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ అనిత ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. ఉద్యోగిని ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ అనిత తెలిపారు. ఇదిలా ఉంటే పత్రికల్లో వచ్చిన వార్తలపై వెల్ఫేర్‌ ఆసిస్టెంట్‌ గుణశేఖర్‌ విలేకరులపై బెదిరింపులకు పాల్పడ్డారు.  పరువునష్టం దావా వేస్తానని, కథ తేలుస్తానంటూ చిందులు తొక్కారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement