అప్పులు తీర్చలేక... బతకలేక! | Tenant farmers incidents cause deep concern | Sakshi
Sakshi News home page

అప్పులు తీర్చలేక... బతకలేక!

Apr 7 2025 5:50 AM | Updated on Apr 7 2025 5:50 AM

Tenant farmers incidents cause deep concern

అప్పుల బాధతో కౌలు రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం 

విషమంగా ఐదుగురి పరిస్థితి 

నంద్యాల జిల్లాలో ఘటన... ఆలస్యంగా వెలుగులోకి...   

పాములపాడు: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కూటమి సర్కారు నిర్లక్ష్యం కారణంగా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. రైతులు, కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అప్పులు తీర్చేమార్గం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాల ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అప్పుల బాధతో ఓ కౌలు రైతు తన కన్నతల్లి, కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి, ఆ తర్వాత అతను కూడా తాగి ఆత్మహత్యకు ప్రయత్నింనంచాడు. 

నంద్యాల జిల్లాలో నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన సోమేశ్వరుడు 10 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పలు పంటలు సాగు చేశాడు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడం, చేతికొచ్చిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రూ.10 లక్షలకు పైగా అప్పులపాలయ్యాడు. దీంతో అప్పులు తీర్చలేనని తీవ్ర మనస్తాపానికి గురైన సోమేశ్వరుడు తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

గురువారం మధ్యాహ్నం కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తన తల్లి శివమ్మ, భార్య లావణ్య, కూతురు నిఖిత(9), కుమారుడు భరత్‌(7)కు ఇచ్చాడు. వారు తాగిన తర్వాత తాను కూడా ఆ కూల్‌ డ్రింక్‌ తాగాడు. అదే రోజు రాత్రి ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురి కాగా, పాములపాడు ఆస్పత్రికి వెళ్లారు. ‘రాత్రి మిగిలిన అన్నం తినడంతో అస్వస్థతకు గురయ్యాం’ అని సోమేశ్వరుడు చెప్పాడు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ‘కలుషిత ఆహారంతో ఐదుగురికి అస్వస్థత’ అని పత్రికల్లో వార్తలు రావడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆదివారం తహసీల్దార్‌ సుభద్రమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర్‌ కర్నూలు ఆస్పత్రికి వెళ్లి సోమేశ్వరుడిని పరామర్శించారు. 

ఐదుగురి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు కలుషిత ఆహారం వల్ల వారు అస్వస్థతకు గురి కాలేదని నిర్ధారించి, గట్టిగా నిలదీయడంతో పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సోమేశ్వరుడు అంగీకరించాడు. ప్రస్తుతం ఐదుగురి కిడ్నీల పనితీరు బాగాలేదని, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పినట్లు ఎంపీడీవో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement