అనంతపురంలో టీడీపీ నేతల భూ కుంభకోణం

TDP Leaders Ecroached Government Lands In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురంలో టీడీపీ నేతల భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. మాజీ సైనికుల పేరిట నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి టీడీపీ నేతలు భూ అక్రమాలకు పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ భూ బాగోతం రాచానపల్లి, ఇటుకలపల్లి, కురుగుంట గ్రామాల్లో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు.

మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ మేరకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమాలపై అనంతపురం ఆర్డీవో మధుసూదన్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో రూ.100 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ఇప్పటికే అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. అక్రమార్కులకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం ఆర్డీవో మధుసూదన్ తెలిపారు. మాజీ సైనికుల పేరుతో వంద కోట్ల రూపాయల విలువైన భూములు స్వాహా చేసిన టీడీపీ నేతల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అనంతపురం జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

నకిలీ పత్రాలతో.. మాజీ సైనికుల పేర్లతో భూమి పట్టాలు పొంది.. ఆ వెంటనే విక్రయించి సొమ్ము చేసుకున్నారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని.. లోతుగా విచారిస్తే వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు ఏవిధంగా స్వాహా చేశారో తెలుస్తుందని స్థానికులు కోరుతున్నారు. 

చదవండిః కన్నయ్య కుమార్‌పై దాడికి యత్నం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top