
పోలీసులు అడ్డుకోవడంతో నారాయణరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించిన పెద్దారెడ్డి
తాడిపత్రి రాకుండా మాజీ ఎమ్మెల్యేను మళ్లీ అడ్డుకున్న పోలీసులు
నారాయణరెడ్డిపల్లిలో దాదాపు 9 గంటల పాటు బైఠాయించిన పెద్దారెడ్డి
జేసీ ప్రభాకర్రెడ్డి ఒత్తిళ్లతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ మండిపాటు
తాడిపత్రి టౌన్/యల్లనూరు: హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ పోలీసులు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా నారాయణరెడ్డిపల్లిలో పెద్దారెడ్డిని పోలీసులు రోడ్డుపై అడ్డుకోవడంతో సోమవారం హైటెన్షన్ నెలకొంది. దీంతో ఆయన రోడ్డుపై కూర్చున్నారు. తన సొంతింటికి వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నారాయణరెడ్డిపల్లి చేరుకున్నారు. రోడ్డుమీదే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంఘీభావం తెలిపారు. ఆయనకు మద్దతుగా అక్కడే ఉన్నారు. దీంతో పోలీసులు గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేసి బలవంతంగా తరలించారు.
వివరాల్లోకి వెళితే.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం ఉదయం 10–11 గంటల మధ్య తాడిపత్రి వెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 14 నెలల తర్వాత హైకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి యల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రిలోని తన ఇంటికి బయలుదేరారు. అయితేకోర్టు ఉత్తర్వులనూ బేఖాతరు చేస్తూ టీడీపీ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు పెద్దారెడ్డిని మరోసారి అడ్డుకున్నారు.
ఆ రోజునుంచీ ఇంతే..
కూటమి అధికారంలోకి వచి్చనప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రాకుండా పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గుతున్న పోలీసులు శాంతిభద్రతల సమస్య అంటూ కేతిరెడ్డికి అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. దీనిపై కేతిరెడ్డి పలుమార్లు కోర్టు మెట్లు ఎక్కారు. చివరగా జిల్లా ఎస్పీ జగదీశ్, తాడిపత్రి సీఐ సాయిప్రసాద్పై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.
దీంతో హైకోర్టు సోమవారం కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేలా తగు చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైతే అదనపు బలగాలను వినియోగించాలని ఆదేశించింది. దీంతో పెద్దారెడ్డి సోమవారం తిమ్మంపల్లి నుంచి 5 వాహనాల్లో అనుచరులతో కలసి తాడిపత్రికి బయలుదేరారు. మార్గంమధ్యలో పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లి వద్ద అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు పోలీసు బలగాలతో కలసి రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను ఉంచి కేతిరెడ్డిని అడ్డుకున్నారు.
9 గంటలపాటు హైడ్రామా
జేసీ ప్రభాకర్రెడ్డి ప్రోద్బలంతోనే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని పోలీసులపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా నన్నెందుకు తాడిపత్రిలోని నా ఇంటికి పంపించడం లేదు. పోలీసు శాఖకు ప్రభాకర్రెడ్డి పెద్దా? అలాగైతే చెప్పండి. అతనికే మొరపెట్టుకుంటా. నాయనా నువ్వు పరి్మషన్ ఇస్తేనే నన్ను పోలీసులు తాడిపత్రికి పంపుతారంట అని. పోలీసులందరికీ జీతాలు ఇస్తున్నావా అని అడుగుతా. పోలీసులంతా జేసీ ప్రభాకర్రెడ్డి సంతృప్తి కోసమే పని చేస్తున్నారు’ అని రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లుని నిలదీశారు. ఏప్రిల్ నుంచి రెండుసార్లు కోర్టు ఆర్డర్ తెచ్చానని, అయినా తాడిపత్రికి పంపకపోవడం తగదన్నారు. తాడిపత్రిలో విగ్రహావిష్కరణ సందర్భంగా పెద్దసంఖ్యలో టీడీపీ మద్దతుదారులు వచ్చారని, మిమ్మల్ని అక్కడికి పంపితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని డీఎస్పీ సమాధానమిచ్చారు.
పోలీసుల తీరుకు నిరసనగా కేతిరెడ్డి పెద్దారెడ్డి నారాయణరెడ్డిపల్లి వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డుపైనే బైఠాయించారు. దాదాపు 9గంటల పాటు అక్కడే ఆందోళన చేపట్టారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అక్కడికి చేరుకుని పెద్దారెడ్డికి సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి తరలివస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
సాయంత్రం 6 గంటల సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను బలవంతంగా అక్కడి నుంచి వెనక్కి పంపించారు. మరోవైపు తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి ఆధ్వర్యంలో పట్టణంలో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి ఇళ్ల సమీపంలోని వీధుల్లోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, వజ్ర వాహనాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఇద్దరు, ముగ్గురు గుమికూడినా హెచ్చరికలు చేస్తూ వెళ్లిపోవాలని సూచించారు.
ఇది అనాగరిక చర్య: గోరంట్ల మాధవ్
కోర్టు ఉత్తర్వులతో తాడిపత్రి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడాన్ని చూస్తే ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని స్పష్టమవుతోందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. రాష్ట్రంలో కేవలం రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేని తాడిపత్రిలో తిరగనివ్వకుండా, ఇంట్లో ఉండకుండా చేయడం అనాగరిక చర్య అని మండిపడ్డారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డిని కంట్రోల్ చేయలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
జేసీ ఆదేశాలతోనే అడ్డుకుంటున్నారు: కేతిరెడ్డి
జేసీ ప్రభాకర్రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. తాడిపత్రిలో మట్కా, గ్యాంబ్లింగ్ జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో పోలీస్ అధికారులు విఫలమయ్యారన్నారు. తాను తాడిపత్రికి వెళితే జేసీ చేస్తున్న అవినీతి, అరాచకాలను బయట పెడతానన్న భయంతో అడ్డుకుంటున్నారన్నారు.
జేసీ హంగామా
కాగా.. సోమవారం తాడిపత్రిలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివుడి విగ్రహాన్ని టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం నేరుగా ఆయన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపానికి వాహనాల్లో అనుచరులతో చేరుకుని.. అక్కడే ఉన్న పోలీసు అధికారులతో మాట్లాడుతూ హంగామా చేశారు. అక్కడి నుంచి తన అనుచరులతో కలిసి ఇంటివరకు నడుచుకుంటూ వెళ్లారు.
కోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వ అప్పీల్
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లి ఉండేందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచి్చన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం ఎదుట సోమవారం అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్పై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరపనుంది.