అంధుల కోసం ‘ఏఐ నేత్ర’ | Students create a guide app for the visually impaired | Sakshi
Sakshi News home page

అంధుల కోసం ‘ఏఐ నేత్ర’

Mar 2 2025 4:29 AM | Updated on Mar 2 2025 4:29 AM

Students create a guide app for the visually impaired

ఫలితాలు ఇస్తున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ముందుచూపు

చీపురుపల్లి జెడ్పీ హైస్కూల్ లో ఏఐ ల్యాబ్‌ ఏర్పాటుతో అంధుల కల సాకారం

కంటిచూపు లేనివారికి దారిచూపే యాప్‌ రూపొందించిన విద్యార్థులు

త్వరలో ఢిల్లీ ఎక్స్‌పోలో బీఏడీ యాప్‌ ప్రదర్శన

అంధులకు దారిచూపే ‘ఏఐ నేత్ర’ సిద్ధమైంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో విజయనగరం జిల్లా చీపురుపల్లి హైసూ్కల్‌ విద్యార్థులు ‘బ్లైండ్‌ పీపుల్‌ అసిస్టెన్స్‌ డివైజ్‌ (బీఏడీ)’ యాప్‌ను రూపొందించారు. అంధులు రోడ్డుపై నడుస్తున్నప్పుడు వారిముందు ఏవైనా వాహనాలు, ఇతర అడ్డంకులు ఉంటే ఈ యాప్‌ మాటల రూపంలో వారి చెవిలో ఇట్టే చెప్పేస్తుంది. వీధులు, ప్రాంతాల పేర్లను సైతం ఆడియో రూపంలో తెలియజేస్తుంది.

చీపురుపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో ఏఐను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మూడేళ్ల కిందటే పరిచయం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోనే తొలిసారిగా చీపురుపల్లి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏఐ ల్యాబ్‌ నెలకొల్పారు. దీనిని ఇక్కడి విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. 

తాజాగా ల్యాబ్‌ ఇన్‌స్ట్రక్టర్, విద్యార్థులు కలిసి అంధుల కోసం ప్రత్యేకంగా ‘బ్లైండ్‌ పీపుల్‌ అసిస్టెన్స్‌ డివైజ్‌ (బీఏడీ)’ యాప్‌ను రూపకల్పన చేశారు. త్వరలో దేశవ్యాప్తంగా ఏఐ ల్యాబ్‌్సలో సిద్ధం చేసిన ప్రాజెక్టులపై ఢిల్లీలో జరగనున్న ఎక్స్‌పోలో చీపురుపల్లి హైస్కూల్ ఏఐ ల్యాబ్‌లో సిద్ధం చేసిన బీఏడీ యాప్‌ను కూడా ప్రదర్శించనున్నారు. 

ఉపయోగాలివీ
ప్రస్తుతం అంధులకు దారి చూపే చాలా పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, అంధులు సునాయాసంగా వారి ప్రయాణా­న్ని సాగిస్తూ ఎలాంటి అవాంతరాలు లేకుండా గమ్యం చేరుకునేలా యాప్‌­ను చీపురుపల్లి ఏఐ ల్యాబ్‌లో ఇన్‌స్ట్రక్టర్‌ ఏవీఆర్‌డీ ప్రసాద్‌ నేతృత్వంలో 8వ తరగతి విద్యార్థులు అంధవరపు నిఖిల, పైడిశెట్టి తనిష్క్‌ సిద్ధం చేశారు. దీనికి బ్లైండ్‌ పీపుల్‌ అసిస్టెన్స్‌ డివైజ్‌ (బీఏడీ)గా నామకరణం చేశారు. 

అంధులు ఈ యాప్‌ను తమ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. వారికి ఎదురుగా ఉండే వాహనాలు, వస్తువులు, వీధులు, ప్రాంతాలు, పేర్లు, దుకాణాలు, వ్యక్తులు ఇలా ఏదైనా సరే అప్రమత్తం చేస్తూ ఆడియో రూపంలో వినిపిస్తుంది. దీని ఆధారంగా అంధులు ముందుకు సాగిపోవచ్చు.

ఏఐతో పరిష్కారం 
సమాజంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఏఐ సహకారం అవసరం. సరి­కొత్త ఆవిష్కరణలకు అవసరమైన ల్యాబ్‌ ప్రభుత్వ బడిలో ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఏఐ ల్యాబ్‌లో అంధుల కోసం ఈ యాప్‌ను రూపొందించాం. ఇక్కడ ల్యాబ్‌లో విద్యార్థులు పైథాన్‌ కోడింగ్‌ నేర్చుకుంటూ కొత్త ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు.  – ఏవీఆర్‌డీ ప్రసాద్, ఏఐ ల్యాబ్‌ ఇన్‌స్ట్రక్టర్, చీపురుపల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement