Hindupuram: Stepfather Demonization Of Girl - Sakshi
Sakshi News home page

మా అమ్మ ముందే ఒళ్లంతా వాతలు పెట్టాడు..

Jul 21 2023 3:10 AM | Updated on Jul 21 2023 2:37 PM

Stepfather demonization of girl - Sakshi

హిందూపురం అర్బన్‌: ‘మా అమ్మ ముందే అతను ఇనుప కడ్డీలతో నా­కు ఒళ్లంతా వాతలు పెట్టాడు టీచర్‌... చాలా నొప్పిగా ఉంది. కూర్చోలేకపోతున్నా...’ అంటూ ఆరేళ్ల చిన్నారి ఏడుస్తూ చెప్పిన మాటలు విని ఆ ఉపాధ్యాయురాలు చలించిపోయారు. చిన్నారిని బుజ్జగించి వివరాలు ఆరా తీయగా... ఓ మారుతండ్రి పైశాచికత్వం వెలుగు చూసింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని బసవేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న అమృతకు చంద్రిక (6) అనే కుమార్తె ఉంది.

కొంతకాలంగా అమృతకు భర్త దూరంగా ఉంటుండగా, ఆమె మణికంఠ అనే ఆటోడ్రైవర్‌తో సహజీవనం చేస్తోంది.బుధవారం రాత్రి చిన్నారి చంద్రిక పరుపుపై మూత్రం పోసిందన్న కారణంతో మారుతండ్రి మణికంఠ ఇను­ప చువ్వలు కాల్చి తల్లి అమృత చూస్తుండగానే బాలిక మూతి, తొడ, ఇతర సున్నిత ప్రాంతాల్లో వాతలు పెట్టాడు. బాలిక రాత్రంతా ఏడుస్తూ ఉండిపోయింది. ఆ చిన్నారి గాయాలతోనే గు­రు­వారం ఉదయం బసవేశ్వర కాలనీలోని పాఠశాలకు వచ్చింది.

పాఠశాలలో సరిగా కూర్చో­లేక ఇబ్బంది పడుతున్న చంద్రికను గుర్తించిన ఉపాధ్యాయురాలు శిల్ప దగ్గరికి తీసుకుని పరిశీలించగా... శరీరమంతా వాతలు కనిపించాయి. టీచర్‌ వెంటనే ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో హిందూపురం రూరల్‌ ఏఎస్‌ఐ జయరామిరెడ్డి పాఠశాల వద్దకు చేరు­కుని చిన్నారి పరిస్థితిని గమనించి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి వెంటనే హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తర­లించి చికిత్స అందిస్తున్నారు.

మణికంఠ తన­కు వాతలు పెట్టినట్లు చిన్నారి పోలీసులకు తెలిపింది. దీంతో మణికంఠపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను వైఎస్సార్‌ సీపీ హిందూపురం సమన్వయకర్త దీపిక పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. బాలికకు వాతలు పెట్టిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement