రుణ లక్ష్యం రూ.2,51,600 కోట్లు | State Level Bankers Committee Meeting Chaired By CM YS Jagan | Sakshi
Sakshi News home page

రుణ లక్ష్యం రూ.2,51,600 కోట్లు

Jul 30 2020 2:52 AM | Updated on Jul 30 2020 3:24 AM

State Level Bankers Committee Meeting Chaired By CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ఈ ఆర్థిక (2020–21) సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక రూ.2,51,600 కోట్లుగా నిర్ధారించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం తన క్యాంపు కార్యాలయంలో 211వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఆర్థిక ఏడాది వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

వ్యవసాయ రంగానికి పెద్దపీట
► 2020–21లో మొత్తం రుణాల లక్ష్యం రూ.2,51,600 కోట్లు. ఇది గత ఏడాదితో పోలిస్తే 9.78 శాతం పెంపు. వ్యవసాయ రంగానికి రూ.1,28,660 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం. గత ఏడాదితో పోలిస్తే 11.9% అధికం.
► సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈలు)కు రూ.39,600 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం. ఇది గత ఏడాదితో పోలిస్తే 10 శాతం పెంపు.
► విద్యా రుణాల కింద రూ.1,900 కోట్లు, ఇళ్ల రుణాల కింద రూ.9,710 కోట్లు, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కింద రూ.410 కోట్లు, పునరుత్పాదక ఇంధన (రెన్యువబుల్‌ ఎనర్జీ) రంగానికి రూ.454 కోట్లు, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు రూ.3,400 కోట్లు ఇవ్వాలని లక్ష్యం. 
► మొత్తం మీద ప్రాధాన్యతా రంగానికి రూ.1,87,550 కోట్లు ఇవ్వాలని లక్ష్యం కాగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 10.88 శాతం అధికం. ప్రాధాన్యేతర రంగానికి రూ.64,050 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యం. గత ఏడాదితో పోలిస్తే 6.75 శాతం పెంపు. 

సకాలంలో రుణ వివరాలు ఇవ్వాలి
► 2019–20లో రుణాల లక్ష్యం రూ.2,29,200 కోట్లు. ఇందులో రూ.2,27,882 కోట్లు రుణాలుగా ఇచ్చారు. మొత్తమ్మీద 99.42 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. వ్యవసాయ రంగంలో రూ.1,15,000 కోట్ల లక్ష్యం మేరకు రూ.1,13,997 కోట్లు రుణాలుగా ఇచ్చారు. లక్ష్యంలో 99.13 శాతం సాధ్యమైంది. 
► రైతులకు సున్నా వడ్డీ సకాలంలోనే ఇవ్వాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందని అధికారులు వెల్లడించారు. ఖరీఫ్‌ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బును రబీ నాటికి చెల్లిస్తామని, రబీ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీని ఖరీఫ్‌ నాటికి చెల్లిస్తామని, ఇందుకు సంబంధించిన వివరాలు సకాలంలో ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులు బ్యాంకర్లను కోరారు. 
► గ్రామాల్లో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్‌ తదితర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దీని కోసం తగిన సహాయం అందించాలన్నారు.
► ప్రతి ఆర్బీకేలో ఈ సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నామని, ప్రతి మండలానికీ కోల్డు స్టోరేజీ, కోల్డు రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఆర్బీకేల ద్వారా రైతుల ఉత్పత్తుల సమాచారాన్ని సెంట్రల్‌ సర్వర్‌కు అనుసంధానం చేసి వారి మార్కెటింగ్‌కు సహకారం అందిస్తామన్నారు.  

నీటి ప్రాజెక్టులకు సాయం అందించాలి
► రాష్ట్రంలో చేపడుతున్న సాగు నీటి ప్రాజెక్టులకూ తగిన సహకారం అందించాలని ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకర్లను కోరారు. గోదావరిలో వరద జలాలను వినియోగించుకోవడానికి బృహత్‌ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, దీనికి తగిన విధంగా తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతుల రుణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 
► ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ నీలం సాహ్ని, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, బ్యాంక్‌ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ వి.బ్రహ్మానందరెడ్డి, నాబార్డ్‌ సీజీఎం సుధీర్‌కుమార్‌ పాల్గొన్నారు.
► వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దినేశ్‌కుమార్‌ గార్డ్, ఆర్బీఐ రీజినల్‌ డైరెక్టర్‌ సుబ్రతాదాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement