బ్యాంకులో రక్తపు మడుగులను పరిశీలిస్తున్న పోలీసులు, క్లూస్ టీం
మేనేజర్, క్యాషియర్పై సుత్తితో దాడి
బ్యాంకు ఉద్యోగి రవికుమార్ అరెస్ట్
బెట్టింగ్లకు బానిపై అప్పుల్లో కూరుకుపోయిన నిందితుడు
వాటిని ఎలా అయినా తీర్చాలనే దోపిడీకి స్కెచ్
మర్రిపాలెం: ఓ బ్యాంక్ ఉద్యోగి విశాఖలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో దోపిడీకి యత్నం చేశాడు. అడ్డు వచ్చిన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్పై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ మేనేజర్ (ఆపరేషన్స్) ఎల్లా రవికుమార్ విశాఖలోని తన మిత్రుడు మేనేజర్గా ఉన్న ఐటీఐ జంక్షన్ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖకు బుధవారం బ్యాంక్ పనివేళలు ముగిసే సమయానికి వెళ్లాడు. ఆ సమయంలో ఆ బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు క్లోజింగ్ ప్రక్రియలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బంగారు నగలను అపహరించేందుకు రవికుమార్ ప్రయత్నించాడు. దీన్ని గమనించిన బ్యాంకు మేనేజర్ శివరామరాజు, అసిస్టెంట్ మేనేజర్ రమేష్లు రవికుమార్ను అడ్డుకునేందుకు యత్నించారు.
దీంతో రవికుమార్ తనతో తెచ్చుకున్న సుత్తితో వారి తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లకు గాయాలవడంతో వారు కేకలు వేశారు. స్థానికులు వెంటనే వచ్చి నిందితుడిని పట్టుకుని క్షతగాత్రులను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కంచరపాలెం పోలీసులు ఘటనాస్థలికి వచ్చి నిందితుడిని అరెస్ట్ చేశారు. బ్యాంకులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను స్వాదీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడిని అదే బ్యాంక్ యలమంచిలి శాఖలో మేనేజర్(ఆపరేషన్స్)గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. కాగా, నిందితుడు బెట్టింగ్లకు బానిసగా మారి అప్పుల్లో కూరుకుపోయాడని, వాటిని ఎలా అయినా తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐటీఐ జంక్షన్ వద్ద ఉన్న ఈ బ్యాంక్ బ్రాంచ్లో గోల్డ్ లోన్లు ఎక్కువగా ప్రాసెస్ చేస్తుంటారని తెలుసుకుని ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది.


